కేసీఆర్ దగాకోరని 11 ఏళ్ల క్రితమే చెప్పా: మంద కృష్ణమాదిగ

Manda Krishna Madiga fires on KCR
  • వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించాలి
  • ఏది కట్టాలన్నా కేసీఆర్‌కు దళితుల భూములే కనిపిస్తున్నాయి
  • ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి మోసగాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పకుండా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డిపైనా మంద కృష్ణ విరుచుకుపడ్డారు. దళితుల భూములను లాక్కోవడంలో ఉపేందర్‌రెడ్డి  ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, అందుకు ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయగూడెం, కూసుమంచి, కొత్తగూడెంలో నిన్న ఆయన పర్యటించారు. కోనాయిగూడెంలో వైకుంఠధామం నిర్మిస్తున్న దళితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

టీఆర్ఎస్ పెద్దల కళ్లు దళితుల భూములపై పడ్డాయని, చంద్రబాబు, ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను కేసీఆర్ ఇప్పుడు లాక్కుంటున్నారని ఆరోపించారు. దొరలకు పోయే రోజులు వచ్చాయని, దళితులకు మూడెకరాల భూమి పేరుతో ఓట్లను కొల్లగొట్టి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దగాకోరని 11 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డులు ఇంకా ఏది కట్టాలన్నా ప్రభుత్వానికి తొలుత దళితుల భూములే కనిపిస్తున్నాయని విమర్శించారు. 
Go Back to Shorts
KCR
Manda krishan madiga
TRS
Khammam District

More Telugu News