అగ్ని ప్రమాదం జరిగిన ఆసుపత్రిలో వసతులపై విచారణ జరిపించాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

  • ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను
  • ఆసుపత్రిలో చేరినవారు ప్రమాదం బారినపడటం విషాదకరం
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినవారు ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమని చెప్పారు.

మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వినియోగిస్తోన్న స్వర్ణపాలెస్‌ హోటల్లో నడుస్తున్న ఈ కరోనా కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర హోటళ్లు, భవనాల్లోని కరోనా కేంద్రాల్లోనూ రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని ఆయన అన్నారు.


Pawan Kalyan
Janasena
Vijayawada
Fire Accident

More Telugu News