పాక్లో ‘అజ్ఞాత’ వేట.. లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిదీ హతం!
- ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో యూనస్ ఆఫ్రిదీ హతం
- సమీపం నుంచి కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు
- లాహోర్, కరాచీల్లో కొన్ని నెలల్లోనే 30 మంది ఉగ్రవాదుల హతం
లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు, ఆ సంస్థ అగ్ర కమాండర్ షేక్ యూనస్ అఫ్రిదీ పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గుర్తుతెలియని దుండగుల చేతిలో హతమయ్యాడు. అతి సమీపం నుంచి దుండగులు జరిపిన కాల్పుల్లో అఫ్రిదీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
గత కొంతకాలంగా పాకిస్థాన్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న కీలక ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. గత నెలలో లాహోర్లో లష్కరే వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హమ్జాపై దాడి జరగ్గా, ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
ముంబై 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కు రైట్ హ్యాండ్ లాంటి అబు ఖతల్ (ఖతల్ సింధీ) కూడా గత ఏడాది ఇదే తరహాలో హతమయ్యాడు. గడిచిన కొన్ని నెలల్లోనే లష్కరే, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన కనీసం 30 మంది కీలక ఉగ్రవాదులు లాహోర్, కరాచీ వీధుల్లో అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమయ్యారు. జైషే మహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ సోదరుడు తాహిర్ అన్వర్ కూడా ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.