‘అపర భగీరథుడు’ కాటన్ స్ఫూర్తిని కొనసాగించాలి: పవన్ కల్యాణ్

Pawankalyan press note
  • కాటన్ జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నా
  • గోదావరి నదిపై 160 ఏళ్ల కిందట ఆనకట్ట నిర్మించారు
  • ఆ ఆనకట్ట వల్లే డెల్టా నేటికీ పచ్చగా కళకళలాడుతోంది 
  సర్ ఆర్థర్ కాటన్ అపర భగీరథుడు అని, గోదావరి నదిపై 160 ఏళ్ల కిందట ఆయన నిర్మించిన ఆనకట్ట వల్లే ఆ డెల్టా నేటికీ పచ్చగా కళకళలాడుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు.

కాటన్ జయంతి సందర్భంగా తన తరపున, జనసైనికుల తరపున మన:పూర్వక అంజలి ఘటిస్తున్నానని అన్నారు. గోదావరి పుణ్య స్నానం ఆచరించేటప్పుడు కాటన్ ను స్మరిస్తూ నేటికీ అర్ఘ్యం సమర్పిస్తున్నారంటే ప్రజలు ఆయనకు అర్పించే కృతజ్ఞతాపూర్వక నివాళి అది అని కొనియాడారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతోపాటు తాగు నీటిని అందించాలంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అని కాటన్ జీవితాన్ని చదివితే అర్థమవుతుందని అన్నారు. కేవలం, గోదావరి ప్రాంతంలోనే కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని అన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులను ఓట్లు కురిపించే సాధానాలుగా భావించే నేటి తరం పాలకులు, కాటన్ తాను చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పడ్డ తపన గురించి తెలుసుకోవాలని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తేనే ప్రాజెక్టులు కాగితాలపై కాకుండా, కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తవుతాయని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
sir Arthor cotton
Godavari

More Telugu News