తూర్పు ఢిల్లీలో మద్యం షాపులు తెరుచుకుని... అంతలోనే మూతపడ్డాయి!

లాక్ డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో మద్యం షాపులు తెరుచుకుంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన మందుబాబులు కనిపిస్తున్నారు. అయితే, తూర్పు ఢిల్లీ పరిధిలో కూడా ఈ ఉదయం మద్యం దుకాణాలు తెరిచారు. దాంతో మద్యం ప్రియులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇన్నిరోజుల మద్యం కరవును తీర్చుకునేందుకు పోటీలు పడి దుకాణాల వద్దకు భారీ సంఖ్యలో వచ్చారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలన్న ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మందు సీసాల కోసం పోటీపడ్డారు.

దుకాణదారులు చేతులెత్తేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. కొన్ని దుకాణాల వద్ద లాఠీ చార్జి చేసి మందుబాబులను తరిమేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఢిల్లీ తూర్పు ప్రాంతం జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ మద్యం షాపులు మూసేయించారు. దాంతో మద్యం ప్రియులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.

East Delhi
Liquor Shops
Physical Distancing
Lockdown
Shut Down
Police

More Telugu News