ఇరాన్కు అణు ఆయుధాలు దక్కనివ్వం.. నావికా దిగ్బంధనం మొదలైంది: ట్రంప్
- ఇరాన్పై అమెరికా నావికా దిగ్బంధనం ప్రారంభమైందని వెల్లడి
- చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు
- ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్మెయిల్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు
- ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదన్న ట్రంప్
"ఇరాన్కు అణు ఆయుధాలు ఉండకూడదన్నదే మా ప్రధాన ఉద్దేశం. ఈ విషయంలో వాళ్లు అంగీకరించలేదు. కానీ, త్వరలోనే వారు అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలాంటి ఒప్పందం ఉండదు" అని ట్రంప్ అన్నారు. చర్చల కోసం ఇరాన్ తమను సంప్రదించిందని, ఒప్పందం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.
నావికా దిగ్బంధనం ఉదయం 10 గంటలకు ప్రారంభమైందని ట్రంప్ ధ్రువీకరించారు. "ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్మెయిల్ చేస్తోంది. దానిని మేము జరగనివ్వం. అందుకే ఈ చర్యలు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిగ్బంధనం ఇరాన్ను చర్చల వైపు మళ్లించడంతో పాటు ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
హర్మూజ్ జలసంధిపై అమెరికా ఇంధన అవసరాల కోసం ఆధారపడటం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. "మాకు ఆ జలసంధి అవసరం లేదు. మాకు కావాల్సిన చమురు, గ్యాస్ మా వద్దే ఉన్నాయి. కానీ ప్రపంచానికి అది అవసరం" అని అన్నారు.
ఇప్పటికే ఇరాన్ నావికాదళం, వాయుసేన, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్కు పరిస్థితులు ఏమాత్రం ఆహ్లాదకరంగా ఉండవని ఆయన హెచ్చరించారు. ఈ దిగ్బంధనం అమలులో ఇతర దేశాలు కూడా తమకు సహకారం అందిస్తాయని ఆఫర్ చేశాయని, చైనా కూడా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటోందని ట్రంప్ వివరించారు.