నిప్పుల కొలిమిలా ఏపీ.. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Heatwave Temperatures Cross 44 Degrees
ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ‌ కూడా రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా 33 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళంలో 4, పోలవరంలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలోని ఒక మండలంలో తీవ్ర వడగాలుల ప్రభావం ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సోమవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా కడపలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా సంజామలలో 44 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో 43.8, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 43, పల్నాడు జిల్లా దుర్గిలో 42.8, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సంస్థ పేర్కొంది.

ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి తప్పనిసరిగా వాడాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా తరచుగా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
AP Heatwave
Andhra Pradesh Heatwave
Heatwave
India Heatwave
Heatwave Warning
IMD Heatwave Alert
Rayalaseema
Coastal Andhra
Temperature
Weather Forecast

More Telugu News