Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై దుమారం... కేసీఆర్ కు సూటి ప్రశ్నలు వేసిన విజయశాంతి!

Vijayashanthi questioned KCR over Owaisi comments
షార్ట్స్‌లో చూడండి
గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ బాధితులకు అందిస్తున్న చికిత్స తీరుపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి టార్గెట్ చేశారు. ఫేస్ బుక్ వేదికగా కేసీఆర్ కు ఆమె సూటి ప్రశ్నలను సంధించారు.

'కరోనా పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న తీరుపై ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో.. కొన్ని లోపాలున్నా, వాటిని పట్టించుకోకుండా అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన కారణంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారికి కరోనా రావాలని కేసీఆర్ గారు శాపం పెట్టారు.

వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్ గారు... మరి, గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారిపై ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. గాంధీ ఆసుపత్రి జైలులాగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్ గారికి బహుశా కేసీఆర్ గారు పెట్టిన శాపం గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్ గారు, తాను ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ గారిలో ధీమా ఉండి ఉండొచ్చు. లేదా మాకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ గారు భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్ కామెంట్స్ పై కేసీఆర్ గారు శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా? అనే విషయాన్ని వేచి చూడాలి' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Akbaruddin Owaisi
MIM
Vijayashanti
Congress
KCR
TRS
Gandhi Hospital
Corona Virus

More Telugu News