Telangana: కాసేపట్లో కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్‌ భేటీ.. తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపులు లేనట్లే?

telangana cabinet  meets on corona
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో లాక్‌డౌన్‌పై ఏం చేద్దామన్న విషయంపై సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది. రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాలని, ఎంతమందికైనా సరే చికిత్స చేయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఉన్నతాధికారులతో సమీక్షలో నిన్న పలు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్‌ ఈ రోజు వాటిపై కేబినెట్ భేటీలోనూ ప్రవస్తావించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిబంధనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేటి భేటీ తర్వాత ఆయా విషయాలపై స్పష్టత రానుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చలు జరపనున్నారు. అలాగే, ఏప్రిల్‌ నెలలో ఇవ్వాల్సిన జీతాలపై చర్చిస్తారు.  

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఈ నెల చివరి వరకు  యథాతథంగా అమలు కానున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి దేశ వ్యాప్తంగా సడలింపులు అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వద్దని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పకడ్బందీగా కొనసాగించాలని సర్కారు భావిస్తోంది. సోమవారం నుంచి పలు మినహాయింపులు ఇస్తూ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను తెలంగాణలో పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుదల తగ్గడం లేదు. ఒకవేళ సడలింపులు ఇస్తే వైరస్‌ వ్యాప్తి నియంత్రణ సాధ్యంకాదని తెలంగాణ  ప్రభుత్వం భావిస్తోంది. నేటి మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ ఈ విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే కేబినెట్‌ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చిస్తారు.
Go Back to Shorts
Telangana
KCR
Corona Virus

More Telugu News