Andhra Pradesh: వైరస్ సోకడాన్ని పాపంగానో, తప్పుగానో చూడొద్దు: ఏపీ సీఎం జగన్

 Dont look at the virus as sinful or wrong says CM Jagan
  • కరోనా వైరస్‌ ఇంచుమించు జ్వరం, ఫ్లూ లాంటిదే
  • వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిపై ప్రభావం ఎక్కువ
  • ఢిల్లీ వెళ్లివచ్చిన వారితోనే వైరస్ వ్యాప్తి
  • వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉందన్న సీఎం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంతో పాటు వారికి చికిత్స అందించే వరకు సమగ్ర విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు.

అయినా,  గత రెండు రోజలుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధ కలిగించే అంశమని బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వాళ్లతోనే వైరస్‌ విస్తరిస్తోందని చెప్పారు. అందువల్ల ఢిల్లీకి వెళ్లిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

కరోనా కూడా మిగతా ఫ్లూ, జ్వరాల లాంటిదే అని సీఎం అన్నారు. కాకపోతే ఎక్కువ వయసున్న వారిలో.. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారిపై తీవ్రత ఎక్కువ ఉంటుందని చెప్పారు. అందువల్ల ఎవరూ అధైర్య పడొద్దని, ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుందని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

 దేశాధినేతలు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకిందన్నారు. అయితే, వాళ్లలో చాలా మందికి జ్వరం వచ్చి నయం అయినట్టుగా కనిపిస్తోందన్నారు. అందువల్ల ఈ వైరస్ సోకడాన్ని పాపంగానో, తప్పుగానో చూడొద్దని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh
cm
YS Jagan
Press Meet
Corona Virus

More Telugu News