ఎన్నికల బరిలో విద్యావంతులు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన వైసీపీ!

  • వైసీపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ హోల్డర్లు
  • రెండు, మూడు స్థానాల్లో డీఎంకే, అన్నాడీఎంకే
  • నాలుగో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ లో గత నెల 11న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే గ్రూప్ 'డేటా ఇంటెలిజెన్స్ యూనిట్' ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల చదువు, అర్హతలను సర్వే చేసింది. ఇందుకోసం వారు సమర్పించిన అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.

ఈ జాబితాలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే గ్రూపు తెలిపింది. వైసీపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని చెప్పింది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో రెండో స్థానంలో నిలవగా, అన్నాడీఎంకే 86.4 శాతంతో మూడోస్థానంలో నిలిచింది.

ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి(80 శాతం), సీపీఎం(78 శాతం), కాంగ్రెస్(76 శాతం), తృణమూల్ కాంగ్రెస్(75 శాతం) బీజేపీ(71 శాతం) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించిన లోక్ సభ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియాటుడే  ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
first
educated canditates
dmk
anna dmk
TRS
india today group

More Telugu News