కేసీఆర్, హరీశ్‌రావులపై ఈసీకి ఫిర్యాదు.. తాను చనిపోతే బొందపెట్టే స్థలం కూడా లేదన్న వంటేరు

  • కేసీఆర్ నాపై 27 కేసులు పెట్టించారు
  • గజ్వేల్‌లో ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేశారు
  • నావి ఆంధ్రా డబ్బులా?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్ ప్రజా కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్‌రావులపై సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై 27 కేసులు పెట్టించారని ఆరోపించారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఇప్పటికే రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఆరోపించారు. తమ ఫోన్లను ట్యాప్ చేశారని, పోలీసులను నిఘాపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఫాం హౌస్‌లో కుప్పలు తెప్పలుగా డబ్బులు ఉన్నాయని, పోలీసులు అక్కడెందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. 337 ఎకరాలున్న కేసీఆర్ తనకు 57 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారన్నారు. మిగిలిన భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తనవి ఆంధ్రా డబ్బులని హరీశ్‌రావు ఎలా అంటారని ప్రశ్నించారు. తాను చనిపోతే బొంద పెట్టే జాగా కూడా లేదన్నారు. తనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోకపోతే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
Go Back to Shorts
KCR
Vanteru pratap reddy
Gajwel
Congress
Harish Rao
EC
Police

More Telugu News