మీ చిల్లర రాజకీయాలు ఇక్కడ చేయొద్దు.. సీఎం చంద్రబాబుకు మంత్రి తలసాని వార్నింగ్!

  • మమ్మల్ని ఈ వివాదంలోకి లాగడం సరికాదు
  • ప్రాణాలు పోతున్నా రాజకీయాలు చేస్తారా
  • జగనే పొడుచుకున్నాడని కూడా చంద్రబాబు చెబుతారు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి వ్యవహారంలో తమను లాగి వివాదం చేయాలనుకుంటే ఊరుకోబోమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ఇక్కడ చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే బాధ్యతాయుతంగా స్పందించి ఖండించామని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లోని న్యూరో సిటీ ఆసుపత్రిలో జగన్ ను పరామర్శించిన అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు.

మనుషుల ప్రాణాలు పోయినా మేం రాజకీయమే చేస్తామని టీడీపీ నేతలు అనుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. జగన్ పై దాడి జరిగితే కేసీఆర్, కేటీఆర్, కవిత ఫోన్ చేసి పరామర్శించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం డ్రామా కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా అడిగినందుకే ఐటీ దాడులు చేస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారనీ, నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఈ మాట అనడానికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా సమావేశం చూసి తాను షాక్ కు గురయ్యానని తలసాని తెలిపారు. ఏపీలోని ఆసుపత్రిలో చేరి ఉంటే జగన్ కావాలని తనను తానే పొడుచుకున్నాడని కూడా చంద్రబాబు చెప్పేవారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Telangana
Talasani
js jagan
attack
Andhra Pradesh
Visakhapatnam District
airport
warning
Chandrababu
hospital

More Telugu News