జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్ పై దాడి .. పరారైన నిందితుడు!

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్ యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్ పై ఈ రోజు హత్యాయత్నం జరిగింది. తుపాకీతో ఉమర్ పై కాల్పులు జరపడానికి ఓ దుండగుడు ప్రయత్నించాడు. అయితే, దాడి నుంచి ఉమర్ సురక్షితంగా బయటపడ్డాడు.

‘యునైటెడ్ అగైనెస్ట్ హేట్’ సంస్థ ఢిల్లీలో సోమవారం ‘భయం నుంచి విముక్తి’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికి హాజరైన అనంతరం ఓ టీ స్టాల్ వద్ద మిత్రులతో కలసి టీ తాగుతుండగా.. ఉమర్ పై ఓ దుండగుడు దాడి చేసి, తోయడంతో అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత కాల్చడానికి ప్రయత్నించడంతో అక్కడనున్న వాళ్లు అడ్డుకున్నారు. దాంతో దుండగుడు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు.

2016, ఫిబ్రవరిలో జేఎన్ యూలో జరిగిన ఓ ర్యాలీలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్, అనిర్బన్ భట్టాచార్యలపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన వీడియోలను ఎడిట్ చేశారని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. రిపబ్లిక్ టీవీ, ఇతర విద్వేష మీడియా కారణంగానే ఉమర్ పై దాడి జరిగిందని జేఎన్ యూ విద్యార్థుల సంఘం మాజీ వైస్ ప్రెసిడెంట్ షీలా రషీద్ ఆరోపించారు.
Go Back to Shorts
JNU
New Delhi
Umar khalid
attacked
pistol

More Telugu News