రేపు ఏపీ భవన్ లో పింగళి వెంకయ్య జయంతి: రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్

స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 141వ జయంతి వేడుకలను న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్)లో రేపు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు.

పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఏపీ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ వేడుకలలో ఢిల్లీ వాసులు, తెలుగు ప్రజలు విరివిగా పాల్గొనాలని ప్రవీణ్ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ ఆచార్యులు, మాజీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ జీవీజీ కృష్ణమూర్తి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు తదితరులు అతిథులుగా పాల్గొంటారని అన్నారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ రమణిగిరి శిష్య బృందంచే ‘ఆంధ్ర నాట్యం’ ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Go Back to Shorts
New Delhi
praveen prakash
pingali venkaiah

More Telugu News