ప్రియుడిని విడిచి ఉండలేక భర్త హత్య... భద్రాచలం సీపీఎం నేత మర్డర్ వెనుక అసలు కథ!

  • వివాహేతర బంధాన్ని నడిపిన కొండలరావు భార్య ముక్తేశ్వరి
  • కుమార్తెను ఒప్పించి ప్రియుడితో కలసి దారుణం
  • హత్యను చూసిన ప్రధాన నిందితురాలి అక్క కుమారుడు
  • మృతదేహాన్ని వెలికితీయించిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం జిల్లా నేతగా, భద్రాచలం సీపీఎం పట్టణ కార్యాలయ బాధ్యుడిగా ఉన్న ఐతంరాజు కొండలరావు హత్యకేసును పోలీసులు ఛేదించారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న ఆయన భార్య ముక్తేశ్వరి, ప్రియుడితో కలసి కొండలరావును హత్య చేసిందని వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కొండలరావు, ఆయన భార్య ముక్తేశ్వరిలకు సంధ్యారాణి అనే కుమార్తె ఉంది. సంధ్యకు ఇటీవలే ఓణీల వేడుక కూడా జరిగింది.

ముక్తేశ్వరికి నానీ అనే మరో యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడిని వదిలి ఉండటం ఇష్టంలేని ముక్తేశ్వరి, నాని, అతని స్నేహితుడు శివ సాయంతో కొండలరావు గొంతునులిమి హత్య చేశారు. హత్యకు కుమార్తె సంధ్యారాణిని కూడా ముక్తేశ్వరి ఒప్పించడం గమనార్హం. ఈ హత్యను ముక్తేశ్వరి అక్క కొడుకు గోపీ చూడగా, విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

ఆపై ముక్తేశ్వరి, నాని, శివ, గోపి, సంధ్యారాణి కలసి మృతదేహాన్ని ఆటోలో వేసుకుని బూర్గంపాడు మండలం పాతగొమ్మూరు ఇసుక రేవుకు వచ్చి పూడ్చిపెట్టారు. ఇక హత్యతో తీవ్రంగా భయపడిన గోపి, తన ఇంట్లో చూసిన విషయాన్ని చెప్పడంతో, కొండలరావు సోదరి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మృతదేహాన్ని వెలికితీయించి, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సహా పలువురు కొండలరావు మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Bhadradri Kothagudem District
Murder
CPM Leader
Kondala Rao

More Telugu News