నెలనెలా రూ.900తో డైమండ్స్ ను కొనుక్కోవడం ఎలా...?

వజ్రం బంగారం కంటే విలువైనది. మరి దీన్ని సొంతం చేసుకోవాలంటే పెట్టుబడి ఎక్కువే కావాలి. కానీ, ఆ అవసరం లేకుండా నెలవారీ కనీసం 900 రూపాయలతో నాణ్యమైన వజ్రాలు సొంతం చేసుకునే అవకాశాన్ని ఇండియన్ కమోడిటీ ఎక్సేంజ్ (ఐసీఎక్స్) కల్పిస్తోంది. ఈ పథకం విధి, విధానాలేంటన్నవి చూద్దాం.


సాధారణంగా మన దగ్గర బంగారం కొనేవాళ్లే ఎక్కువ. ఇక వజ్రాలు కొనేవారు ఎక్కువ మంది సంపన్నులే అయి ఉంటారు. ఎందుకంటే, వజ్రాల ఖరీదు అధికంగా ఉండడమే కారణం. కానీ, విలువైన వజ్రాలను తమ ప్లాట్ ఫామ్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని ఇండియన్ కమోడిటీ ఎక్చేంజ్ చెబుతోంది. వజ్రాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించేందుకు ఐసీఎక్స్ కు ఇటీవలే సెబీ ఆమోదం తెలిపింది. వజ్రాల్లో ట్రేడింగ్ ప్రారంభించనున్న ప్రపంచంలో మొదటి కమోడిటీ ఎక్చేంజ్ ఇదే. ఇక వజ్రాలపై సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడం కూడా ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అంటే ఒకవైపు వజ్రాలను సొంతం చేసుకోవాలనుకునేవారూ, మరోవైపు వజ్రాలపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ ఐసీఎక్స్ అవకాశం కల్పిస్తోందన్నమాట. వజ్రాలపై ట్రేడింగ్ ను, సిప్ విధానంలో ఇన్వెస్ట్ మెంట్ ను ఈ సంస్థ ఈ నెల చివర్లోగా ప్రారంభించనుంది.

కొనుగోలు ఎలా...?
ప్రస్తుతం సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్, బంగారం ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే అవకాశం మాత్రమే ఉంది. కానీ, డైమండ్స్ లో సిప్ విధానం అన్నది ఇంత వరకూ ఎక్కడా లేదని ఐసీఎక్స్ అంటోంది. వజ్రాలు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారు, వజ్రాలపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఐసీఎక్స్ బ్రోకర్ వద్ద ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. కేవైసీ వివరాలను పూర్తి చేయాలి. అంటే వ్యక్తిగత గుర్తింపు, చిరునామా గుర్తింపు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, స్టేట్ మెంట్, ఇతర వివరాలన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సిప్ విధానంలో్ పెట్టుబడి పెట్టాలనుకుంటే బ్రోకర్ కు ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అందులోనూ ప్రతీ నెలా ఏ తేదీ అనుకూలంగా ఉంటుందో చెబితే, ఆ తేదీ నాటికి నగదు డిపాజిట్ చేస్తే బ్రోకర్ మీ తరఫున డైమండ్స్ ను ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు ఆర్డర్ ను ప్రాసెస్ చేస్తారు.  

చక్కని అవకాశం
రూ.900 రూపాయలకు ఏమొస్తుందన్న సందేహం వచ్చే ఉంటుంది. కానీ, ప్రతి నెలా 900 చొప్పున కనీసం రెండున్నరేళ్ల పాటు పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. అప్పుడు 27,000 అవుతుంది. 30 సెంట్లు, 50 సెంట్లు, 100 సెంట్లు (ఒక క్యారట్)... ఈ మూడు రకాల సైజుల్లో డైమండ్లపై లావాదేవీలను ఐసీఎక్స్ ప్రారంభించనుంది. స్టాక్ మార్కెట్లలో షేర్లు ఎలా ట్రేడవుతాయో, ఐసీఎక్స్ లో వజ్రాల ట్రేడింగ్ కూడా అదే మాదిరిగా కొనసాగుతుంది. కనీసం ఒక సెంట్ నుంచి డైమండ్ ను కొనుగోలు చేయవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. కనీసం 30 సెంట్లు పోగైన తర్వాతే నేరుగా అసలైన వజ్రాల రూపంలో డెలివరీ తీసుకోవచ్చు. ఇవి సహజమైన వజ్రాలని, వీటి కచ్చితత్వం, నాణ్యత, కట్, పాలిష్ తదితర అంశాలను డీబీర్స్ సంస్థ నిర్ధారించిన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఐసీఎక్స్ ప్రకటించింది. అత్యధిక నాణ్యత కలిగిన వజ్రాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశ్యమే తమదని తెలిపింది.

ప్రస్తుత ధరల మేరకు 30 సెంట్ల వజ్రం ఖరీదు 27,000గా ఉంది. అందుకే కనీసం 30 సెంట్ల వజ్రాన్ని ప్రతీ నెల రూ.900 చొప్పున, రెండున్నరేళ్ల కాల వ్యవధిలో పొందేందుకు వీలుగా ఐసీఎక్స్ ఇలా ప్లాన్ చేసింది. ఒకవేళ సిప్ రూపంలో పెట్టుబడులు కొనసాగించకపోయినా ఫర్వాలేదు. కొన్ని నెలల పాటు పెట్టుబడులు పెట్టిన తర్వాత అప్పటి వరకు డీమ్యాట్ రూపంలో చేరిన వజ్రాలను ఐసీఎక్స్ లో విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. లేదంటే సిప్ ఆపేసి మళ్లీ వీలైనప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు.


More Articles