బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం... 8 మంది మృతి

Eight people died in Sivakasi explosion
  • తమిళనాడులోని శివకాశిలో ఘటన
  • బాణసంచా కోసం రసాయన పదార్థాలు కలుపుతుండగా పేలుడు
  • మృతుల్లో ఐదుగురు మహిళలు... 12 మందికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని విరుదు నగర్ జిల్లా శివకాశి వద్ద ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీ సుదర్శన్ ఫైర్ వర్క్స్ కంపెనీలో జరిగిన భారీ పేలుడు కారణంగా 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు మహిళలు ఉన్నారు. 12 మందికి తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి. 

టపాకాయల్లో నింపేందుకు రసాయన పదార్థాలు సిద్ధం చేస్తుండగా, ఒక్కసారిగా పీడనం పెరిగిపోవడంతో విస్ఫోటనం సంభవించింది. 

జిల్లా ఎస్పీ ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ కంపెనీకి లైసెన్స్ ఉందని వెల్లడించారు. రసాయన పదార్థాలను కలుపుతుండగా, ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయి పేలుడు సంభవించినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు. 

శివకాశి పట్టణం బాణసంచా కర్మాగారాలకు నెలవు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఇక్కడ్నించి బాణసంచా సరఫరా అవుతుంది. అయితే, ఇక్కడి బాణసంచా ఫ్యాక్టరీల్లో గతంలో అనేక అగ్నిప్రమాదాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 

భారతదేశ బాణసంచా రాజధానిగా పేరున్న శివకాశిలో అనేక కర్మాగారాలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దానికితోడు సరైన శిక్షణ లేకుండానే కార్మికులను నియమించుకోవడం, వారికి రసాయన పదార్థాల పట్ల ఎలాంటి అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు దారితీస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఫైర్ సేఫ్టీ నిపుణుడు డాక్టర్ వి.శ్రీరామ్ స్పందిస్తూ, శివకాశిలో జరిగిన పేలుడు ఘటనల్లో 99 శాతం మానవ తప్పిదం వల్ల జరిగినవేనని వెల్లడించారు.
Advertisement
Sivakasi
Fire Works
Explosion
Virudu Nagar
Tamil Nadu

More Telugu News