ఈ కాలుష్యం చాలా డేంజర్.. సంతాన లోపం, కిడ్నీ సమస్యలు.. ప్రమాదాలెన్నో

కాలుష్యం.. ప్రపంచమంతటినీ వణికిస్తున్న భూతమిది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. మానవ మనుగడపై ప్రభావం చూపుతూనే ఉంది. గుండె సంబంధిత జబ్బులతో సంభవిస్తున్న మరణాల్లో 75 శాతం, ఊపిరితిత్తుల వ్యాధులతో జరుగుతున్న మరణాల్లో 25 శాతం కేవలం గాలి కాలుష్యం కారణంగానేనని ఇప్పటికే పరిశోధకులు నిర్ధారించారు. ముఖ్యంగా భారత్, చైనా దేశాలతో కూడిన ఆసియా ఖండం ప్రాంతంలో కాలుష్యం కారణంగా మరణాలు మరింత ఎక్కువని గుర్తించారు. అంతేకాదు కాలుష్యం కారణంగా వంధ్యత్వం, ఎముకలు గుల్లబారిపోవడం వంటి శారీరక సమస్యలతోపాటు మానసిక సమస్యలూ తలెత్తుతాయని తాజాగా పలు పరిశోధనల్లో తేల్చారు. మరి ఈ ప్రమాదాలు, వాటిని నివారించే మార్గాలు తెలుసుకుందాం..

వంటగది నుంచి వాహనాల పొగ దాకా..

వాయు కాలుష్యం నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద సమస్య. మనకుకనిపించే కాలుష్యం పొగ గొట్టాల నుంచి, శిలాజ ఇంధనాల దహనం నుంచి, వాహనాలు తదితర వాటి నుంచి  ఎక్కువగా వెలువడుతోంది. వీటి వల్ల అతి ప్రమాదకరమైన గోధుమ రంగు పొగ మంచు (బ్రౌన్ హెజ్) వాతావరణంలో ఏర్పడుతోంది. ఇది మనిషిఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనదని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • శిలాజ ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి వాటిని మండించినప్పుడు అతి సూక్ష్మమైన కణాలు (అల్ట్రా ఫైన్ పార్టికల్స్) వెలువడుతాయి. 
  • వీటి నుంచే కాకుండా గ్యాస్ ఆధారిత వాహనాల నుంచి వచ్చే పొగ, గడ్డిని కోసే యంత్రాలు (లాన్ మూవర్స్), కట్టెలను కాల్చడం, ఎండిపోయిన ఆకులను కాల్చలడం, స్మోకింగ్ ద్వారా కూడా అల్ట్రాఫైన్ పార్టికల్స్ గాలిలో కలుస్తున్నాయి.
  • ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. అంతేకాకుండా వంట గదిలో చికెన్, మటన్ వంటకాలు చేసేటప్పుడు కూడా ఈ కణాలు వెలువడుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
  • ఇవి వేగంగా గాలిలో కలిసిపోతాయని, తర్వాత ఒకదానికొకటి కలసి పెద్ద కణాలుగా మార్పు చెందుతాయని గుర్తించారు. ఈ అల్ట్రాఫైన్ పార్టికల్స్ రహదారుల పక్కన ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

సంతాన సామర్థ్యం తగ్గిపోవడం

 గాలిలో అత్యధిక కాలుష్యం కారణంగా పురుషుల్లో వంధ్యత్య సమస్య తలెత్తుతోందని తైవాన్ కు చెందిన పరిశోధకులు తేల్చారు. కాలుష్యం వల్ల పురుషుల్లో వీర్య కణాల నాణ్యత తగ్గిపోతోందని గుర్తించారు. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 6,500 మంది పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి, వాటి పరిస్థితి, క్రియాశీలత తదితర అంశాలపై మూడు నెలల పాటు అధ్యయనం చేశారు. ఈ ఫలితాలను రెండేళ్ల సమయానికి అన్వయించి.. అంచనాలను రూపొందించారు.
  • గాలిలో చేరే పర్టిక్యులేట్ మేటర్ (PM) అత్యధిక స్థాయిల్లో పీల్చడం వల్ల వీర్య కణాల ఆకారం, పరిమాణం అసాధారణంగా మారిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. (పర్టిక్యులేట్ మేటర్ అంటే గాలిలో చేరే అతి సూక్ష్మ రసాయన కణాలు, దుమ్ము, ధూళి కణాలు).
  • అయితే వారిలో వీర్య కణాల సంఖ్య మాత్రం తగిన సంఖ్యలోనే ఉన్నట్లు నిర్ధారించారు. కానీ వాటి సామర్థ్యం లోపించడం కారణంగా.. ఈ వీర్య కణాలు గర్భధారణ కోసం పనికిరానివిగా మారిపోతున్నాయని తేల్చారు.

ఎముకలు గుల్లబారి విరిగిపోవడం

ఆస్టియో పోరోసిస్.. అంటే ఎముకల కణాల్లో సాంద్రత తగ్గి గుల్లబారిపోయే సమస్య. దీనివల్ల ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి చిన్న దెబ్బ తగిలినా విరుగుతాయి. సాధారణంగా వయసు మీద పడిన కొద్దీ ఎముకల్లో పటుత్వం తగ్గుతూ ఆస్టియో పోరోసిస్ సమస్య తలెత్తుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆస్టియో పోరోసిస్ కారణంగా సుమారు 89 లక్షల మంది ఎముకలు విరిగే సమస్య (కాళ్లు, చేతులు, ఇతర భాగాల్లో ఎముకలు విరగడం) బారిన పడుతున్నట్లు ప్రపంచ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ లెక్కతేల్చింది. అయితే గాలి కాలుష్యం ఈ ఆస్టియోపోరోసిస్ సమస్య మరింతగా పెరగడానికి కారణమవుతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గాలి కాలుష్యానికి గురైనప్పుడు శరీరంలో పారా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతోందని, ఇది ఆస్టియో పోరోసిస్ కు దారి తీస్తోందని గుర్తించారు. ది లాన్సెట్: ప్లానెటరీ హెల్త్ జర్నల్ లో వారి అధ్యయన నివేదిక ప్రచురితమైంది.
  • అమెరికన్ శాస్త్రవేత్తలు రెండు దశల్లో ఈ అధ్యయనం చేశారు.
  • తొలి దశలో కాలుష్యం ఎక్కువగా ఉండే ఒక ప్రాంతాన్ని, కాలుష్యం అతి తక్కువగా ఉండే మరో ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతాల్లో 65 ఏళ్లు పైబడిన 92 లక్షల మందికి సంబంధించిన వైద్య రికార్డులను పరిశీలించారు. 2003 నుంచి 2010 వరకు ఏడేళ్లకు సంబంధించిన డేటాను సేకరించి విశ్లేషించారు. ఏయే ప్రాంతంలో ఏ సమయంలో ఎంత మంది ఎముకలు విరిగిన సమస్యతో బాధపడింది లెక్కించారు. ఆయా సమయాల్లో ఏ ప్రాంతంలో ఎంత గాలి కాలుష్యం నమోదైంది పోల్చి చూశారు. మొత్తంగా కాలుష్యం స్థాయి అధికంగా నమోదైన ప్రాంతాలకు చెందినవారిలో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎక్కువగా ఉందని, ఎముకలు విరిగే సమస్య కూడా ఎక్కువగా ఉందని గుర్తించారు. 
  • ఇక శాస్త్రవేత్తలు రెండో దశలో వాహనాల కాలుష్యం అత్యధికంగా ఉండే ఓ పట్టణ ప్రాంతాన్ని ఎంచుకుని పరిశోధన చేశారు. 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న 692 మంది పురుషులకు సంబంధించి.. కొన్నేళ్ల వైద్య రికార్డులను పరిశీలించారు. కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతాల వారితో పోల్చితే.. కాలుష్యం అధికంగా ఉన్న ఈ పట్టణ ప్రాంతాల వారిలో పారా థైరాయిడ్ హార్మోన్ స్థాయి తక్కువగా ఉందని, ఆస్టియో పోరోసిస్ సమస్య అధికంగా ఉందని గుర్తించారు. శరీరంలో ఎముకల నిర్మాణం, ఎముకలు పటిష్టంగా ఉండడం కోసం పారాథైరాయిడ్ హార్మోన్ కీలకంగా పనిచేస్తుంది. ఇది తక్కువగా ఉండడం కారణంగా ఎముకలు గుల్లబారుతాయి.

పక్షవాతం ముప్పు కూడా..

 గాలి కాలుష్యం కారణంగా పక్షవాతం వచ్చే ముప్పు కూడా పెరుగుతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవలి ఓ అధ్యయనంలో తేల్చారు. పక్షవాతం, దాని సంబంధిత సమస్యల కారణంగా  ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా. దీని బారినపడి ఎంతో మంది శారీరక వైకల్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు పక్షవాతానికి, కాలుష్యానికి మధ్య సంబంధంపై పరిశోధన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాలకు చెందిన 62 లక్షల మంది పక్షవాతం బాధితులపై జరిగిన 94 అధ్యయనాలను ఒక చోట క్రోడీకరించి పరిశీలించారు. 1948 నుంచి 2014 మధ్య సుదీర్ఘంగా జరిగిన ఆ అధ్యయనాల ఆధారంగా.. పక్షవాతం సమస్యలకు, గాలిలో హానికర రసాయనాలు, పర్టిక్యులేట్ మేటర్ స్థాయిలకు మధ్య సంబంధమున్నట్లు గుర్తించారు.
  • విపరీతంగా గాలి కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో చిన్న వయసులోనే పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో నిర్ధారించారు.
  • ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని.. ఇతర సమస్యలతో పాటు గాలి కాలుష్యం కూడా తోడై బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి కారణమవుతోందని వారు చెబుతున్నారు.

కిడ్నీల పనితీరుకు దెబ్బ

విపరీతంగా గాలి కాలుష్యానికి లోనవుతున్న వారిలో మూత్రపిండ (కిడ్నీ) సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.  గాలిలోని కలుషితాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి చేరుతున్నాయని, ఆ కలుషితాలను తొలగించే క్రమంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయని తేల్చారు. వారు ఈ అంశంపై చాలా పెద్ద పరిశోధనే చేశారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన శాటిలైట్ల ద్వారా పలు ప్రాంతాల్లో గాలి కాలుష్యం స్థాయిలను లెక్కించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో నివసించే సుమారు 20 లక్షల మందికి సంబంధించిన వైద్య రికార్డులను విశ్లేషించారు.
  • గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు ఏటేటా బాగా పెరిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 
  • అత్యధిక కాలుష్యం స్థాయిలే కాదు.. కొంచెం కాలుష్యంతోనూ కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుందని.. కాలుష్యం స్థాయిని బట్టి సమస్యల తీవ్రత ఉంటుందని అమెరికాకు చెందిన సెయింట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్ డైరెక్టర్ జియాద్ అల్లీ పేర్కొన్నారు.

కాలుష్యంతో అధిక రక్తపోటు ముప్పు...

 ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్న సమస్యల్లో అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఒకటి. కాలుష్యం కారణంగా కూడా ఈ సమస్య మరింతగా ఉధృతమవుతున్నట్లు యురోపియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం స్పెయిన్, జర్మనీ, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు చెందిన 41 వేల మందిపై 2008 నుంచి 2015 వరకు పరిశోధన చేశారు. సర్వే కోసం ఎంచుకున్న సమయంలో వారెవరికీ కూడా అధిక రక్తపోటు సమస్య లేదు. అనంతరకాలంలో 15 శాతం మందికి ఈ సమస్య తలెత్తింది.
  • అధ్యయనం చేసిన వారిలో అధిక రక్తపోటు సమస్య తలెత్తిన వారి వివరాలను పరిశీలించగా.. వారంతా గాలి కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
  • గాలిలో రసాయన కలుషితాలు, పర్టిక్యులేట్ మేటర్ ఊపిరితిత్తుల ద్వారా శరీరంలో చేరి ఆరోగ్య సమస్యలను తలెత్తుతున్నాయని, అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తోందని పరిశోధనకు నేతృత్వం వహించిన జర్మనీ హెన్రిచ్ హేయిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బార్బరా హాఫ్ మన్ వెల్లడించారు.

గర్భస్త శిశువుల ఎదుగుదలపై ప్రభావం

గాలిలో ఉండే హానికరమైన, విషపూరిత రసాయనాలు గర్భస్థ శిశువుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భం తొలి దశలో అంటే ఒకటో నెల నుంచి మూడో నెల వరకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ జేసన్ బ్లమ్ నేతృత్వంలోని బృందం దీనిపై పరిశోధన చేసింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో చిన్నారులకు జన్మనిచ్చిన మహిళల వైద్య రికార్డులను, ఆయా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను వారు విశ్లేషించారు. దీంతోపాటు ప్రయోగశాలలోనూ గర్భస్థ ఎలుకలపై పరిశోధన చేశారు. 
  • కాలుష్యం కారణంగా గర్భంలో పిండం ఎదుగుదల దెబ్బతింటుందని, నెలలు నిండకముందే కాన్పు జరుగుతుందని పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ముఖ్యంగా గర్భం తొలిదశలో అంటే తొలి మూడు నాలుగు నెలల పాటు తీవ్ర స్థాయిలో కాలుష్యానికి గురైతే.. బిడ్డ చాలా తక్కువ బరువుతో జన్మిస్తున్నట్లుగా వెల్లడైంది.

కలుషితాలతో మానసిక సమస్యలు

 కలుషితమైన గాలి కారణంగా శారీరక సమస్యలే కాదు.. మానసిక సమస్యలూ తలెత్తుతున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు తేల్చారు. దీనిపై అమెరికాలోని పలు ప్రాంతాల్లో గాలి కాలుష్యం డేటాను సేకరించి, ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యం రికార్డులతో సరిపోల్చి విశ్లేషించారు. కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే.. ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వారు 17 శాతం ఎక్కువగా మానసిక సమస్యలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
  • ఇక పురుషులతో పోలిస్తే.. మహిళలపై గాలి కాలుష్యం ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు ఏకంగా 39 శాతం మంది మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నట్లు తేల్చారు.
  • గాలిలోని కలుషితాలు.. మనలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికితోడు కలుషితమైన గాలి కారణంగా వచ్చే శ్వాస సమస్యలు, చర్మ సమస్యలు వంటివి కూడా ఒత్తిడిని పెంచుతున్నాయని పేర్కొంటున్నారు.

అన్నీ కలసి గుండె జబ్బులు

 గాలిలో కలుస్తున్న వాహనాల పొగ, ఫాక్టరీలు, ఇతర కలుషితాల కారణంగా గుండె పోటు, కవాటాలు, రక్తనాళాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. ఆల్కాహాల్, కాఫీ వంటి వాటి అతి వినియోగం కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎంతగా ఉందో.. గాలి కాలుష్యం కారణంగా అంతే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తోంది. ఇందుకోసం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శాస్త్రవేత్తలు 1960 నుంచి 2010 మధ్య జరిగిన 36 అధ్యయనాల ఫలితాలను క్రోడీకరించి పరిశీలించారు.
  • మొత్తంగా సంభవిస్తున్న గుండెపోటు ఘటనల్లో 5 నుంచి 7 శాతం వరకు గాలి కాలుష్యమే కారణమని వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ముఖ్యంగా ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు గాలి కాలుష్యానికి లోనైతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

(ఆయా పరిశోధనల నివేదిక ఆధారంగా రాసిన రాసిన కథనం. అవగాహన కోసం మాత్రమే)


More Articles