Advertisement

రేపే వెలిగొండకు కృష్ణమ్మ పరుగులు.. దశాబ్దాల కలను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu to fulfill decades long dream by inaugurating Veligonda Project tomorrow
  • రేపు వెలిగొండ ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • నల్లమల సాగర్‌లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాల విడుదల
  • మూడు దశాబ్దాల కరువు ప్రాంత రైతుల కల సాకారం
  • సాగు, తాగునీటితో పాటు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
  • నిర్వాసితులకు వేగంగా పరిహారం అందించిన కూటమి ప్రభుత్వం
మార్కాపురం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. కరువు నేల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖిస్తూ, వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు జాతికి అంకితం చేయనున్నారు. తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టును, తానే ప్రారంభించే అరుదైన అవకాశం చంద్రబాబుకు దక్కింది. లక్షలాది మంది రైతుల సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమంతో పశ్చిమ ప్రకాశం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి కృష్ణా జలాలను తరలించే ఈ బృహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఫీడర్ కెనాల్ గేట్లను ఎత్తి, 10.7 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే వెలిగొండపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, గడిచిన రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టు కోసం రూ.2,400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. దీంతో కలగా మిగిలిపోతుందనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు కళ్లముందు సాక్షాత్కరించింది.

ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీంతో పాటు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలను పట్టిపీడిస్తున్న తీవ్రమైన ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. కృష్ణమ్మ రాకతో కరవు నేలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసితులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. కేవలం మూడు విడతల్లోనే 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని వేగంగా అందించింది. అదనంగా మరో రూ.169 కోట్లను కూడా ప్రకటించింది. 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణా, 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. నిర్వాసిత మహిళలను గౌరవించేలా చీర, పసుపు, కుంకుమ అందించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని 'వెలిగొండ పండుగ'గా జరుపుకునేందుకు ప్రతి గ్రామం కళకళలాడుతోంది.
Advertisement
Chandrababu Naidu
Veligonda Project
Krishna River water
Prakasam district irrigation
Nallamala Sagar reservoir
Andhra Pradesh water projects

More Telugu News