మహారాష్ట్ర రాజకీయంలో పెను సంచలనం: కాంగ్రెస్లో విలీనం కానున్న శరద్ పవార్ పార్టీ.. తెరవెనుక చకచకా కదులుతున్న పావులు!
- కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) విలీన చర్చలు
- మహారాష్ట్ర రాష్ట్రస్థాయి నేతల మధ్య అంతర్గత సమాలోచనలు
- ఢిల్లీ వేదికగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం
- మహా వికాస్ అఘాడీ కూటమిలో పెరుగుతున్న విభేదాలు
- 1999 నాటి చారిత్రక చీలికకు ముగింపు పలికే దిశగా అడుగులు
ప్రస్తుతం ఈ విలీన ప్రతిపాదనలపై రాష్ట్రస్థాయిలోనే ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఎన్సీపీ (ఎస్పీ) తమ పార్టీ అంతర్గతంగా నేతలందరి మధ్య ఒక ఏకాభిప్రాయాన్నిసాధించిన తర్వాత, ఈ అంశాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ విలీన ఆలోచన వచ్చినప్పటికీ.. ఎన్నికల ప్రచారం, వ్యూహాల బిజీ వల్ల దీనిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది.
కూటమిలో కుదుపు.. 27 ఏళ్ల చరిత్రకు ముగింపు?
ఈ విలీన వార్తలు 'మహా వికాస్ అఘాడీ' (ఎంవీఏ - కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ థాకరే) కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఉద్ధవ్ థాకరే వర్గంలో జరిగిన తిరుగుబాట్లు, అలాగే కూటమి ఐక్యతపై స్వయంగా ఉద్ధవ్ థాకరే బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎంవీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పటికే తీవ్రమైన భేదాభిప్రాయాలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్, ఎన్సీపీ విలీన ప్రయత్నాలు కూటమి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల వివాదం నేపథ్యంలో.. శరద్ పవార్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత మళ్లీ అదే కాంగ్రెస్ గూటికి శరద్ పవార్ చేరబోతుండటం గమనార్హం. 2023లో ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ సొంతంగా చీలిక తెచ్చి అధికార పక్షంతో చేతులు కలపడం వల్ల ఎన్సీపీ మరింత బలహీనపడింది. ఇటీవల అజిత్ పవార్ గ్రూపుతో విలీనాన్ని పూర్తిగా తోసిపుచ్చిన శరద్ పవార్.. ఇప్పుడు కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధమవ్వడం మహారాష్ట్ర పాలిటిక్స్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.