ఢిల్లీ మెడలు వంచుతామంటారు.. ఇక్కడికొచ్చి సైలెంట్ అవుతారు: పవన్ చురకలు
- ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం' ప్రత్యేక సమావేశం
- అధికారం కోసం పార్టీ పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
- దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యమని వెల్లడి
- తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్న జనసేనాని
- విభజన జరిగిన తీరుపైనే తన ఆవేదన అని వ్యాఖ్య
ఈ పన్నెండేళ్లలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని పవన్ గుర్తుచేశారు. కొన్ని పార్టీలు కేవలం తమ మనుగడ కోసం దేశ సమగ్రతను పణంగా పెడుతున్నాయని ఆరోపించారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటుపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిన తీరుపైనే ఆనాడు ఆవేదన వ్యక్తం చేశానని వివరించారు.
విభజన జరిగిన తీరు రెండు రాష్ట్రాల మధ్య అసంతృప్తిని, అశాంతిని మిగిల్చిందని, ఆస్తుల పంపకాల వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. "ఢిల్లీకి వచ్చి మెడలు వంచుతామని మాట్లాడే నాయకులు ఇక్కడికి రాగానే మౌనంగా ఉండిపోతారు" అని ఆయన అన్నారు. దేశ రక్షణకు, భద్రతకు ఢిల్లీ ప్రధాన కేంద్రమని, భారత రాజ్యాంగం పుట్టిన చోటు కాబట్టే జాతీయ సమగ్రతపై మాట్లాడేందుకు ఈ వేదికను ఎంచుకున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.