నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు

Kesineni Nani Appeals to CM Chandrababu Naidu Over Alleged Harassment of Childhood Friend
  • తన చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు కేసులు పెట్టారన్న కేశినేని నాని
  • ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి
  • విజయవాడ ఎంపీ, తన సోదరుడు చిన్ని ప్రోద్బలంతోనే వేధింపులని ఆరోపణ
  • పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆవేదన
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒక ముఖ్య విజ్ఞప్తి చేశారు. తన చిన్ననాటి స్నేహితుడైన తాటినేని రాంబాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఈ వ్యవహారంలో సీఎం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు. తన సోదరుడు, ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రోద్బలంతోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని నాని తన సోషల్ మీడియా పోస్టులో సంచలన ఆరోపణలు చేశారు.

రాంబాబు ఇంట్లో లేని సమయంలో పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి తప్పుడు కేసులు నమోదు చేశారని నాని తెలిపారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని, పోలీస్ యంత్రాంగాన్ని ఇలా దుర్వినియోగం చేయవద్దని కోరారు. తాటినేని రాంబాబు తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని, గతంలో తమ కుటుంబ వ్యాపార వ్యవహారాల్లో కూడా ఆయన ఉన్నారని గుర్తుచేశారు.

గత కొంతకాలంగా కేశినేని సోదరుల మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని, తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన సోదరుడు చిన్ని టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా పరిణామంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
 
 
Advertisement
Kesineni Nani

More Telugu News