ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే
- ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ ఖర్గే
- ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టారని విమర్శ
- సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపారని మండిపాటు
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేరళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి అంశాలు చర్చకు వస్తే అధికార పార్టీకి ఎక్కడ ఓట్ల నష్టం జరుగుతుందోననే భయంతోనే మోదీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా ముగిసి, ఫలితాలు వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సామాన్యుడిపై మోయలేని భారం పడేలా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఒక్కసారిగా పెంచేశారని ఆయన దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ప్రజా శ్రేయస్సుపై పట్టింపు ఉంటే, ఈ ధరల పెంపు నిర్ణయాన్ని ఎన్నికలకు ముందే ఎందుకు ప్రకటించలేదని ఖర్గే ప్రశ్నించారు. ఒకవేళ ప్రధాని మోదీ ధైర్యం చేసి ఈ ధరల పెంపును పోలింగ్కు ముందే ప్రకటించి ఉంటే... ప్రజలు కచ్చితంగా ఓటు హక్కు ద్వారా మోదీ సర్కార్కు సరైన బుద్ధి చెప్పేవారని, ఆ భయంతోనే ప్రభుత్వం ఈ ద్రోహానికి ఒడిగట్టిందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.