సీఎం సువేందు అధికారికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు.. ప్రజల విజయమని వ్యాఖ్య
- ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి
- శ్యామా ప్రసాద్ ముఖర్జీ గడ్డపై బీజేపీ అధికారం చేపట్టడం గొప్ప నివాళి అన్న పవన్
- ఈ విజయం కార్యకర్తల దశాబ్దాల పోరాటానికి దక్కిన గౌరవమని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయాన్ని భారత ప్రజల విజయంగా పవన్ అభివర్ణించారు. ముఖ్యంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మించిన బెంగాల్ గడ్డపై, ఆయన ఆశయాలకు అనుగుణంగా బీజేపీ అధికారం చేపట్టడం ఒక గొప్ప నివాళి అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల పోరాటం తర్వాత లభించిన ఈ ఫలితం కార్యకర్తల కృషికి దక్కిన గౌరవమని కొనియాడారు.
సరిహద్దు రాష్ట్రమైన బెంగాల్లో అక్రమ వలసలు, తీవ్రవాద చొరబాట్లు జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని... సువేందు అధికారి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన ఆశించారు. హింస, అరాచకాలకు తావులేకుండా పారదర్శకమైన పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయానికి పునాది అని చెబుతూ.. అమిత్ షా, నితిన్ నబిన్, సమిక్ భట్టాచార్యలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.