కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ

support maize farmers cm chandrababu naidus letter to union minister shivraj singh chouhan
  • మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు
  • ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి
  • నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రబీ సీజన్‌లో మొక్కజొన్న ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,600 నుంచి రూ.1,700 మధ్యే పలుకుతోందని, అయితే కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400గా ఉందని చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ ధరల వ్యత్యాసం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. "రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంది," అని సీఎం తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో, రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఆశా (PM-AASHA) పథకం కింద 'ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని' (PDPS) తక్షణమే అమలు చేయాలని చంద్రబాబు కోరారు. ఈ పథకం కింద అయ్యే 100 శాతం ఆర్థిక భారాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని లేఖలో అభ్యర్థించారు. కేంద్రం సకాలంలో స్పందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అదనపు భారం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandra Babu
andhra pradesh
Union Govt
maize farmers
shivraj singh chouhan

More Telugu News