Indian Athletes Doping: క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం!

 India Now has the Worlds Most Ineligible Athletes AIU List Reveals
షార్ట్స్‌లో చూడండి
భారత అథ్లెటిక్స్ రంగం ఓ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నిషేధానికి గురైన అథ్లెట్లు ఉన్న దేశంగా భారత్ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఈ జాబితాలో ముందున్న కెన్యాను వెనక్కి నెట్టి, భారత్ అగ్రస్థానానికి చేరడం క్రీడా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలోని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ఏప్రిల్ 1న విడుదల చేసిన తాజా జాబితాలో ఈ చేదు వాస్తవం వెలుగులోకి వచ్చింది.

ఏఐయూ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 148 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు నిషేధంలో ఉన్నారు. ఇది కెన్యా కంటే రెండు ఎక్కువ. ఈ జాబితాలో 66 మంది నిషేధిత అథ్లెట్లతో రష్యా మూడో స్థానంలో ఉంది. కేవలం డోపింగ్ పరీక్షల్లో పట్టుబడినవారే కాకుండా నమూనాలను తారుమారు చేయడం, పరీక్షలకు గైర్హాజరు కావడం, నిషేధిత పదార్థాలను సరఫరా చేయడం, తమ ఆచూకీ వివరాలను వెల్లడించడంలో విఫలమవడం వంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు.

పలువురు ప్రముఖ అథ్లెట్లపై కొనసాగుతున్న‌ నిషేధం 
ఈ జాబితాలో పలువురు భారత స్టార్ అథ్లెట్లు ఉండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. మహిళల 100 మీటర్ల జాతీయ రికార్డు హోల్డర్ ద్యుతీ చంద్ 2022 డిసెంబర్ నుంచి నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పర్వేజ్ ఖాన్‌పై 2030 జులై వరకు, తమిళనాడు స్ప్రింటర్ శేఖర్ ధనలక్ష్మిపై 2025లో విధించిన ఎనిమిదేళ్ల నిషేధం కొనసాగుతోంది. వర్ధమాన క్రీడాకారుల నుంచి జాతీయ స్థాయి స్టార్లు వరకు డోపింగ్ మహమ్మారి విస్తరించిందని ఇది స్పష్టం చేస్తోంది.

ఏఎఫ్ఐ కఠిన చర్యలు 
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) రంగంలోకి దిగింది. డోపింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయని అనుమానిస్తున్న శిక్షణా కేంద్రాలపై కఠిన చర్యలు ప్రారంభించింది. కోచ్‌లందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది. నమోదు చేసుకోని కోచ్‌ల వద్ద శిక్షణ పొందే అథ్లెట్లు జాతీయ అవార్డులకు అనర్హులుగా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 

2024 పారిస్ ఒలింపిక్స్ అనంతరం జాతీయ శిక్షణా శిబిరాలను వికేంద్రీకరించి, కేవలం రిలే జట్లకు మాత్రమే కేంద్రీకృత శిక్షణనిస్తున్నారు. దీంతో పలువురు అగ్రశ్రేణి అథ్లెట్లు రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ, టాటా వంటి ప్రైవేట్ సంస్థల వద్ద లేదా ఆర్మీ, నేవీ వంటి ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ఈ సంస్కరణలు డోపింగ్‌ను అరికట్టాలన్న చిత్తశుద్ధిని సూచిస్తున్నప్పటికీ, ఏఐయూ గణాంకాలు మాత్రం భారత అథ్లెటిక్స్ ముందున్న అతిపెద్ద సవాల్‌ను, కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి.
Go Back to Shorts
Indian Athletes Doping
Dutee Chand
Dutee Chand doping
India doping ban
Athletics Integrity Unit
AIU report
Parvej Khan
Sekhar Dhanalakshmi
AFI actions
National Anti-Doping Agency

More Telugu News