Iran Navy: 84 మంది నావికుల మృతదేహాలను ఇరాన్ కు పంపించిన శ్రీలంక

Sri Lanka Sends 84 Iranian Navy Bodies Back to Iran
శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ నావికులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 84 మృతదేహాలను శ్రీలంక ప్రభుత్వం ఇరాన్ కు పంపించింది. ఈ మేరకు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మత్తల అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానంలో ఈ మృతదేహాలను తరలించారు.

మార్చి 11న గాలే చీఫ్ మేజిస్ట్రేట్ సమీర దొడంగోడ ఇచ్చిన ఆదేశాల మేరకు మృతదేహాలను ఇరాన్ రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. గాలేలోని నేషనల్ ఆసుపత్రిలో రెండు మొబైల్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లలో వీటిని భద్రపరిచారు. గాలే హార్బర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన అభ్యర్థన మేరకు న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

మార్చి 4న అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు చెందిన ఐరిస్ డేనా యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో దాడి చేసి, ముంచివేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. "మా జలాంతర్గామి ప్రయోగించిన టార్పెడో దాడిలో ఆ నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రు నౌకను టార్పెడోతో ముంచివేయడం ఇదే తొలిసారి" అని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ దాడి గురించి అమెరికా తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఘటనపై శ్రీలంక ఆరోగ్య, ప్రసార శాఖ మంత్రి నళింద జయతిస్స మాట్లాడుతూ, విషయం తెలిసిన వెంటనే తమ నౌకాదళం స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ దుర్ఘటనలో మొత్తం 87 మృతదేహాలను వెలికితీయగా, 32 మందిని ప్రాణాలతో కాపాడినట్లు తెలిపారు. వీరిలో 10 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరిలో విశాఖపట్నంలో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో ఈ ఇరాన్ యుద్ధనౌక పాల్గొన్నట్లు సమాచారం.
Iran Navy
Sri Lanka
Iranian Navy
US Navy
IRIS Dena
America
Galle
Naval Exercise
Nalinda Jayatissa
Pete Hegseth

More Telugu News