Ponnam Prabhakar: తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం... త్వరలో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డు

Ponnam Prabhakar Mahalakshmi Smart Card for Free Bus Travel Soon
  • ఆధార్ కార్డులు తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ కార్డులు
  • జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం, ఆర్టీసీ నిర్ణయం
  • పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో మండలంలో స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది. ఈ మేరకు స్మార్ట్ కార్డులను త్వరగా సిద్ధం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి స్మార్ట్ కార్డులను ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్మార్ట్ కార్డులు వస్తే మహిళలు ఆధార్ కార్డులు వెంట తీసుకువెళ్లవలసిన అవసరం ఉండదు.

రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్డీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనలను ఎండీ నాగిరెడ్డి భట్టివిక్రమార్కకు వివరించారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ స్మార్ట్ కార్డులను వీలైనంత త్వరగా మహిళలకు అందించాలని భట్టివిక్రమార్క ఆదేశించారు.

స్మార్ట్ కార్డులకు సంబంధించి మూడు డిజైన్‌లను ఉప ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రిలకు ఎండీ నాగిరెడ్డి చూపించారు. వీటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపించాలని నిర్ణయించారు.

చిప్‌లతో కూడిన ఈ స్మార్ట్ కార్డులకు రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, మొదట జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ కార్డులను అమలు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు ఇస్తామని తెలిపారు. 
Ponnam Prabhakar
Telangana RTC
Mahalakshmi Smart Card
Free Bus Travel
Telangana Government

More Telugu News