Shoaib Akhtar: పాక్‌పై భారత్ ఘనవిజయం నేపథ్యంలో తమ జట్టుపై నిప్పులు చెరిగిన షోయబ్ అక్తర్!

Shoaib Akhtar criticizes Pakistan team after loss to India
  • టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
  • 61 పరుగుల భారీ తేడాతో చిత్తయిన దాయాది జట్టు
  • పాక్ ఆటతీరు, పీసీబీ చైర్మన్‌పై మండిపడ్డ షోయబ్ అక్తర్
  • భారత్‌ను ఓడించడం కలలో కూడా సాధ్యం కాదని వ్యాఖ్య
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత జట్టు 61 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ గెలుపు కంటే పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సొంత జట్టుపైనా, క్రికెట్ బోర్డుపైనా చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్‌తో తలపడటానికి కూడా పాక్ జట్టు అర్హత లేదన్నట్లు ఆయన మాట్లాడారు.

ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ పాకిస్థాన్ ఓటమిపై అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మేము మ్యాచ్‌లో ఎక్కడా పోటీలోనే లేము. ఒకప్పుడు భారత్‌తో మైదానంలో పోరాడేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లను ఓడించడం అన్నది కలలో కూడా ఊహించలేం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీపై విరుచుకుపడ్డాడు. "క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యాడు. అలాంటి అసమర్థులకు ‘జాహిల్’ (అజ్ఞాని)లకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుంది?" అని తీవ్రంగా విమర్శించాడు.  బాబర్ ఆజమ్‌ను ఉద్దేశించి, "మ్యాచ్ గెలిపించలేని ఆటగాడిని సూపర్ స్టార్‌ను చేశారు" అని మండిపడ్డాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అద్భుతమైన అర్ధశతకంతో చెలరేగగా, కెప్టెన్ సూర్యకుమార్ (32), శివమ్ దూబే (27) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో అయూబ్ మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (44) మినహా ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ తన రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.
Shoaib Akhtar
Pakistan cricket
India vs Pakistan
T20 World Cup
Mohsin Naqvi
Babar Azam
Suryakumar Yadav
Cricket Board
Pakistan Cricket Board

More Telugu News