Maoists: ఛత్తీస్ గఢ్ సరిహద్దులో మావోయిస్టుల భారీ డంప్ ధ్వంసం

Security Forces Seize Large Maoist Weapon Stockpile in Chhattisgarh
  • మీనాగట్ట అడవుల్లో ఆయుధ తయారీ కేంద్రం
  • ధ్వంసం చేసిన భద్రతా దళాలు
  • భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధ సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన జవాన్లు, మీనాగట్ట అడవుల్లో భూమిలో పాతిపెట్టిన పేలుడు పదార్థాలను మరియు ఆయుధాలను వెలికితీశారు.

సరిహద్దు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని, ప్రదేశంలో మావోయిస్టులు నిల్వ చేసిన భారీ ఆయుధ గిడ్డంగిని గుర్తించారు. ఆయుధ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న వాటిలో భారీ ఎత్తున ఐఈడీ పేలుడు పదార్థాలు, వైర్లు, డిటోనేటర్లు, మందుగుండు సామగ్రి మరియు కొన్ని దేశవాళీ తుపాకులు ఉన్నాయి. వీటితో పాటు మావోయిస్టులకు సంబంధించిన యూనిఫామ్‌లు, కిట్ బ్యాగులు మరియు విప్లవ సాహిత్యాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. మావోయిస్టులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు పదార్థాలను అమర్చాలని భావించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నామని, అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News

Maoists
Chhattisgarh
Odisha
IED
Naxalites
security forces
anti-naxal operation
arms dump
explosives
Minagatta forest