India: శ్రీలంకకు మానవతా సాయం.. పాకిస్థాన్ ఆరోపణలను ఖండించిన భారత్

India Rejects Pakistans Claims on Sri Lanka Aid Overflight
  • భారత్ ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్థాన్ ఆరోపణ
  • ఖండించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
  • పాక్ విజ్ఞప్తికి గంటల్లోనే అనుమతి ఇచ్చినట్లు వెల్లడి
శ్రీలంకకు మానవతా సహాయం అందజేస్తున్న పాకిస్థాన్ విమానాలకు భారత ప్రభుత్వం ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందన్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని, భారత్‌పై వ్యతిరేకతను వ్యాప్తి చేయడానికి, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి చేస్తున్న మరో ప్రయత్నమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు.

ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్‌పై పాకిస్థాన్ చేసిన ప్రకటన గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జైశ్వాల్ సమాధానమిస్తూ, పాకిస్థాన్ చేసిన అభ్యర్థనను భారత్ త్వరగా పరిశీలించి, ఓవర్ ఫ్లైట్ అనుమతిని మంజూరు చేసిందని వెల్లడించారు. పాకిస్థాన్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పాక్ వాదనను ఆయన పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

శ్రీలంకకు మానవతా సహాయం తీసుకువెళుతున్న పాకిస్థానీ విమానాలకు ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ కోసం డిసెంబర్ 01న మధ్యాహ్నం 1.00 గంటలకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు అందిందని తెలిపారు. మానవతా సహాయం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం అదే రోజున అభ్యర్థనను వేగంగా పరిశీలించి అనుమతిని మంజూరు చేసిందని పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు ఓవర్ ఫ్లైట్ అనుమతిని మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. క్లిష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.
India
Sri Lanka
Pakistan
Humanitarian aid
Overflight clearance
Randhir Jaiswal
Islamabad

More Telugu News