50 శాతం డిస్కౌంట్తో కారు జరిమానా చెల్లించిన సీఎం సిద్ధరామయ్య
- చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
- 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ వాహనదారులకు ఊరట
- రాయితీ అనంతరం రూ. 8,750 చెల్లించిన సిద్ధరామయ్య
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే వాహనంపై మొత్తం ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వాటిలో సీటు బెల్టు ధరించనందుకు ఆరుసార్లు, అతివేగం కారణంగా ఒకసారి చలానా విధించారు. అయితే, ముఖ్యమంత్రి వాహనానికి జరిమానా ఉన్నప్పటికీ చెల్లించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. దీనితో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది స్పందించి, రాయితీ పథకం ద్వారా చలానా చెల్లించారు. రాయితీ మినహాయించి రూ. 8,750 చెల్లించారు.
ట్రాఫిక్ చలానాల రాయితీ పథకాన్ని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 వరకు ప్రభుత్వం ప్రకటించింది. జరిమానాకు గురైన వాహనదారులు 50 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తామని తెలిపింది. ఈ రాయితీ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 40 కోట్లు వసూలయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెల్లడించారు.