Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్ హయాంలో 15 వేల ఎన్‌కౌంటర్లు, 238 మంది నేరస్థుల హతం

Yogi Adityanath Era 15000 Encounters 238 Criminals Killed
  • సుమారు 30 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడి
  • ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నామని వెల్లడి
  • మీరట్ జోన్‌లో అత్యధిక ఎన్‌కౌంటర్లు జరిగినట్లు వెల్లడి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో రాష్ట్రంలో 15 వేల ఎన్‌కౌంటర్‌ కేసులు నమోదయ్యాయని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయని, కీలక ఆపరేషన్‌లలో 238 మంది మరణించారని డీజీపీ రాజీవ్ కృష్ణ వెల్లడించారు.

దాదాపు 30 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేశామని, పోలీసులపై దాడికి ప్రయత్నించిన ఘటనల్లో 9 వేల మందికి కాలికి గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. పరారీలో ఉన్నవారు, తరుచూ నేరాలకు పాల్పడే వారి కోసం చేపట్టిన ఆపరేషన్‌లలో 238 మంది మరణించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

గడిచిన ఎనిమిదేళ్లలో 14,973 ఆపరేషన్లు చేపట్టి 30,694 మంది నేరస్థులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో పోలీసులపై దాడులకు పాల్పడిన 9,467 మందికి కాలికి గాయాలయ్యాయని తెలిపారు. మీరట్ జోన్‌లో అత్యధిక ఎన్‌కౌంటర్లు జరిగాయని డీజీపీ తెలిపారు. ఆ తర్వాత ఆగ్రా, బరేలీ, వారణాసిలలో నేరస్థులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నేర నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన అన్నారు.
Yogi Adityanath
Uttar Pradesh
UP Police
Encounters
Crime control
Rajeev Krishna
Meerut
Agra
Varanasi
Criminals

More Telugu News