ఏపీ వ్యాప్తంగా ఇంటింటికీ ‘సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం ప్రారంభం
- 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో కూటమి ప్రభుత్వ కొత్త కార్యక్రమం
- రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళుతున్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు
- ఏడాది పాలన, సూపర్ 6 అమలుపై ప్రజలకు ప్రత్యక్షంగా వివరణ
- కరపత్రాలు పంచుతూ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ
- కూటమి పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయని ప్రజల హర్షం
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న 'సూపర్ 6' హామీల పురోగతిని ప్రజలకు వివరిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, కీలక ప్రాజెక్టుల వివరాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడమే కాకుండా, ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు కూడా స్వీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలులో వివక్షను ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో 'సూపర్ 6' పథకాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా అందుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేసినట్లు నాయకులు తెలిపారు.
ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచడంతో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఈ ప్రచారంలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజా భాగస్వామ్యంతో పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.









