అణ్వాయుధాల సంగతి మరచిపోండి.. ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- లేదంటే మిలటరీ యాక్షన్ కు వెనుకాడబోనన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు
- న్యూక్లియర్ డీల్ ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం
- ఇటీవల ఒమన్ వేదికగా ఇరుదేశాల మధ్య చర్చలు
గత శనివారం అమెరికా, ఇరాన్ ల మధ్య న్యూక్లియర్ డీల్ కు సంబంధించి ఒమన్ వేదికగా చర్చలు జరిగాయి. చర్చలు ముగిసిన తర్వాత ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. అమెరికాతో అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని పేర్కొంది. రెండో దశ చర్చలు వచ్చే శనివారం రోమ్ వేదికగా జరుగుతాయని తెలిపింది. కాగా, ఇరుదేశాల మధ్య అణ్వాయుధ ఒప్పందానికి సంబంధించి చర్చలు ఒబామా కాలం నుంచే జరుగుతున్నాయని, బైడెన్ హయాంలోనూ చర్చలు జరిపినా ఒప్పందం మాత్రం కుదరలేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే ఒప్పందంపై సంతకం చేయడానికి ఆలస్యం చేస్తోందని తాజాగా ట్రంప్ ఆరోపించినట్లు సమాచారం.