రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి హత్య

Youth kills girl in Eluru after finding out about her engagement
  • ఏలూరులో ఘటన 
  • డిగ్రీ చదివే రోజుల్నుంచి బాధితురాలి వెంట పడుతున్న నిందితుడు
  • ఇటీవల ఆమె పెళ్లి కుదరడంతో నడిరోడ్డుపై యువతిపై కత్తితో దాడి
  • ఆపై తనూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం
  • నిందితుడి ఆరోగ్యం విషమం, ఆసుపత్రిలో చికిత్స
ప్రేమోన్మాదంతో రెచ్చిపోయిన యువకుడు ఓ యువతిని నడి రోడ్డు మీద దారుణంగా నరికి హత్య చేశాడు. ఆపై తనూ గొంతు కోసుకున్నాడు. ఏలూరులో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీలో నివాసముంటున్న జక్కుల రామారావుకు ఇద్దరు భార్యలు, రెండో భార్య రాజ్యలక్ష్మి, రామారావులకు ఏకైక కుమార్తె రత్నాగ్రేస్ అలియాస్ స్వీటీ (23) డిగ్రీ పూర్తి చేసింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. 

రత్నాగ్రేస్ డిగ్రీ చదువుతున్నప్పుడు ముసునూరుకు చెందిన కట్టుబోయిన ఏసురత్నం పరిచయమయ్యాడు. ఆ తరువాత తనను ప్రేమించాలంటూ అతడు యువతి వెంటపడటం మొదలుపెట్టాడు. 2023లో వీరి చదువు పూర్తయ్యింది. ఆ తరువాత కూడా ఏసురత్నం అప్పుడప్పుడూ ఏలూరు వచ్చి రత్నా గ్రేస్ ‌ను ప్రేమించాలంటూ వేధించేవాడు. కొన్ని రోజుల క్రితం ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో, వారు ఏసురత్నం తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేయడంతో అతడిని మందలించారు. 

మరోవైపు, ఈ నెల 26న రత్నాగ్రేస్ కు నిశ్చితార్థమైంది. జూన్ 16న వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన ఏసురత్నం ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. అది కుదరకపోతే ఆమె ఇంకెవరికీ దక్కకూడని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో రత్నా గ్రేస్ గురువారం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం తను పనిచేసే స్కూలు పక్కనే ఉన్న బ్యాంకు వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. అక్కడ అప్పటికే ఉన్న ఏసురత్నం తననే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. తనకు పెళ్లి నిశ్చయమైందని రత్నాగ్రేస్ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు తన బ్యాగులోని కత్తిని తీసి.. తనను చంపమంటూ ఆమె చేతికిచ్చాడు. దీంతో ఆమె అతడిని వారించింది. 

ఇంతలో ఏసురత్నం ఒక్కసారిగా ఆమె మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో, ఆమె తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత ఏసురత్నం కూడా తన గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అతడూ స్పృహ కోల్పోయాడు. అటుగా వెళుతున్న పోలీసులు వారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఏసురత్నం పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
Go Back to Shorts
Eluru
Crime News
Andhra Pradesh

More Telugu News