ఇది ఒక అపురూపమైన అనుభూతి: వైఎస్ షర్మిల

YS Sharmila casted vote
  • ఇడుపులపాయలో ఓటు వేసిన షర్మిల
  • నాన్న పోటీ చేసిన స్థానంలో పోటీ చేయడం అపురూపమైన అనుభూతి అని వ్యాఖ్య
  • ఈసీ పారదర్శకంగా పని చేయాలన్న షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని... వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని... పారదర్శకంగా పని చేయాలని అన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిల అన్నారు. నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నానని చెప్పారు. అమ్మానాన్నల ఆశీస్సులు, దేవుడి దీవెనలు తనకు ఉన్నాయని నమ్ముతున్నానని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. 

మరోవైపు ఓటు వేసేందుకు బయల్దేరే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కోసం భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు. 


Advertisement
YS Sharmila
Congress
YS Rajasekhar Reddy

More Telugu News