అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

Nirmal Police Filed Case Aganist Congress Leader Addanki Dayakar
  • ఆదిలాబాద్ సభలో రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు
  • పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు
  • సెక్షన్ 504, 505/2 కింద కేసు పెట్టిన పోలీసులు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నోరు జారిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసులు అద్దంకి దయాకర్ పై ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద కేసు పెట్టినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 5న ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలను విమర్శిస్తూ శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘తెలంగాణలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ‘మేం హిందువులం.. శ్రీరాముడి వారసులం’ అంటున్నారు. మీరు శ్రీరాముడి వారసులు ఎలా అయ్యారు? రాముడు మీ చిన్నాయనా, సీత మీ చిన్నమ్మనా’’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను ఖండించాయి. అద్దంకి దయాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. కాగా, శ్రీరాముడిపై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అద్దంకి దయాకర్ వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను కొంతమంది కావాలనే వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేశారని ఆరోపించారు.
Go Back to Shorts
Addanki Dayakar
Congress
Lord Sriram
Adilabad Sabha
BJP leaders

More Telugu News