Revanth Reddy: కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు దిక్కుమాలిన ప్రచారం: పాత నోటీసును ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy tweets about OU closing
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిక్కుమాలిన దివాలాకోరు ప్రచారం చేస్తున్నారని, ఇది ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై కేసీఆర్ నిన్న ట్వీట్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోత, తాగు, సాగునీటి కొరత ఉందనడానికి యూనివర్సిటీలోని నీటి సమస్యనే కారణమని పేర్కొన్నారు.

కేసీఆర్ ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి అదే ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. 'కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని... మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి నోటీసునే జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గత ఏడాది యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు సెలవులు జారీ చేస్తూ ఇచ్చిన నోటీసును అటాచ్ చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana
KCR

More Telugu News