Ayodhya: జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్

Ram Came In My Dream Says Tej Pratap Yadav On Big Ayodhya Event
  • ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య
  • నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి
  • బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన లాలూ ప్రసాద్ కొడుకు
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్ అని బీహార్ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు. ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని వివరించారు. అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని, అలాంటి చోటుకు తాను వెళ్లబోనని చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయాక తనను మరిచిపోతారని వ్యాఖ్యానించినట్లు తేజ్ ప్రతాప్ తెలిపారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడంలేదంటూ నలుగురు శంకరాచార్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నలుగురు శంకరాచార్యుల కలలోకి వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు రాముడు తనతో పేర్కొన్నాడన్నారు. అందుకే వారు అయోధ్యకు రావడం లేదని తేజ్ ప్రతాప్ వివరించారు. కాగా, తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై కానీ, అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం విషయంపై కానీ ఆయన సోదరుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
Ayodhya
Ram mandir
Tejpratap
Bihar Minister
Lord Ram
Dream
Lalu Prasad Yadav

More Telugu News