Cricket: వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానం సుస్థిరం.. సమీకరణాలు ఇవే!

Indias Win Over South Africa Mean to Finish On Top 1
  • 16 పాయింట్లతో టాప్-1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్న భారత్ 
  • మరో జట్టు 16 పాయింట్లు సాధించే ఛాన్స్ లేకపోవడంతో అగ్రస్థానం పదిలం
  • నాలుగవ స్థానంలో నిలిచే జట్టుతో సెమీస్ పోరు ఖరారు

వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా అద్భుత విజయం సాధించింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు గట్టి పోటీ ఇస్తారని భావించినా మైదానంలో తేలిపోయారు. దీంతో భారత్ 243 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టోర్నీ లీగ్ దశ ముగింపునకు చేరుకోవడంతో ఇతర ఏ జట్టుకైనా నంబర్ వన్ స్థానానికి చేరుకునే అవకాశం ఉందా.. అంటే ఏమాత్రం అవకాశం కనిపించడం లేదు. దక్షిణాఫ్రికాపై గెలుపుతో అగ్రస్థానాన్ని భారత్ పదిలం చేసుకుంది.

టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఏదైనా అద్భుతం జరిగి చివరి మ్యాచ్‌లో ఓడిపోయినా భారత్ ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి. టోర్నీలోని ఇతర ఏ జట్టూ 16 పాయింట్లు సాధించే అవకాశం కనిపించడం లేదు. సెమీఫైనల్‌కు అర్హత సాధించి రెండవ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు కూడా ఆ ఛాన్స్ లేదు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఉంది. చివరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లే ఉంటాయి. మరోవైపు ఆస్ట్రేలియాకు మిగిలిన 2 మ్యాచ్‌ల్లో గెలిచినా ఆ జట్టు వద్ద కూడా 14 పాయింట్లే ఉంటాయి. కాబట్టి టీమిండియా అగ్రస్థానానికి ఎలాంటి ఢోకా లేదు. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో సెమీ-ఫైనల్ పోరులో తలపడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలావుండగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాపై టీమిండియా ఆటగాళ్లు చెలరేగి ఆడారు. ఏకంగా 243 పరుగుల తేడాతో గెలుపొందారు. విరాట్ కోహ్లి వన్డేల్లో 49వ శతకాన్ని నమోదు చేశాడు. రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. దీంతో 83 పరుగులకే సౌతాఫ్రికా కుప్పకూలిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News