భారత్-కెనడా మధ్య ఉద్రిక్తత.. ఖలిస్థాన్ గ్రూపులతో పాక్ గూఢచారుల రహస్య సమావేశం

Amid India and Canada row Pak spy agents secretly meet Khalistani groups in Canada
  • ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తముందని కెనడా ఆరోపణ
  • ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం
  • ఐదు రోజుల క్రితం వాంకోవర్‌లో ఐఎస్ఐ ఏజెంట్లు-ఖలిస్థానీ పెద్దల రహస్య సమావేశం
  • భారత వ్యతిరేక ప్రచారాన్ని వీలైనంత ముమ్మరం చేయాలని నిర్ణయం
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రసంస్థ అధిపతులతో రహస్య సమావేశం నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. వాంకోవర్‌లో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సమావేశంలో సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) చీఫ్ గుర్‌పత్వంత్‌సింగ్ పన్నున్ సహా ఇతర పెద్దలు హాజరైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని వీలైనంత త్వరగా వ్యాప్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

‘ప్లాన్-కె’గా వ్యవహరిస్తున్న కుట్రలో భాగంగా కెనడాలో ఖలిస్థానీ కార్యకలాపాలకు పాక్ ఐఎస్ఐ కొన్ని నెలలుగా భారీగా నిధులు సమకూరుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం, పోస్టర్లు, బ్యానర్లు ముద్రించడం వంటి వాటికి ఈ సొమ్మును ఖర్చు చేస్తున్నారు. భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ గూఢచారులు-ఖలిస్థానీ ఉగ్రవాదుల మధ్య రహస్య సమావేశం జరిగిన విషయం వెలుగుచూడడం గమనార్హం.

ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారన్నది కెనడా ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం కెనాడాలో 20 మందికిపైగా ఖలిస్థానీ ఉగ్రవాదులు, ఏజెంట్లు తలదాచుకుంటున్నారు.
Go Back to Shorts
India
Canada
Pak ISI
Khalistani Groups
Hardeep Singh Nijjar

More Telugu News