Advertisement

జనం కష్టాల్లో ఉంటే రూ.12 కోట్లతో హాలిడే ట్రిప్ కు వెళ్లాడు: లోకేశ్

Lokesh take a jibe at CM Jagan in Bhimavaram rally
  • పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ యువగళం
  • భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర
  • భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో భారీ సభ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర భీమవరంలో జనసంద్రంగా మారింది. భీమవరం పట్టణంలో అడుగడుగునా లోకేశ్ కు అపూర్వస్వాగతం లభించింది. 

205వ రోజు యువగళం పాదయాత్ర భీమవరం శివారు శ్రీరామ ఆటోమొబైల్స్ నుంచి ప్రారంభం కాగా... ప్రకాశం చౌక్, పొట్టిశ్రీరాములు విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం, సోమేశ్వరస్వామి ఆలయం, తాడేరు బ్రిడ్జి, ఇందిరమ్మ కాలనీ, తాడేరు మెయిన్ రోడ్డు, తాడేరు అంబేద్కర్ బొమ్మ మీదుగా బేతపూడి వరకు పాదయాత్ర సాగింది. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.

జగన్ హాలిడే సీఎం... ఆయన వచ్చాక అన్నీ హాలీడేలే!

జగన్ హాలిడే సీఎం. జనం కష్టాల్లో ఉంటే రూ.12 కోట్లు పెట్టి లండన్ హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. అటువంటాయన పేదలకి పెత్తందార్లకి యుద్ధం అని ఫోజులు కొడుతున్నాడు. జగన్ సీఎం అయిన రోజు నుండి రాష్ట్రంలో ప్రజలందరికి హాలిడే ఇచ్చాడు. 

ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలు తరిమేసి యువతకు హాలిడే ఇచ్చాడు. ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే ఇచ్చాడు. రైతుల్ని ముంచి క్రాప్ హాలిడే ఇచ్చాడు. ఇప్పుడు పరిశ్రమలకు కరెంట్ కోతలు పెట్టి పవర్ హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలకు 12 గంటలు పవర్ హాలిడే అంట. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకే యంత్రాలు తిప్పాలంట. టైం దాటి ఇండస్ట్రీ నడిస్తే కేసులు పెట్టి ఫైన్లు వేస్తారట. 

జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు, పవర్ హాలిడే దెబ్బకి ఉన్న పరిశ్రమలు కూడా బైబై ఏపీ అనడం ఖాయం. ఉభయగోదావరి జిల్లాలు దాటేలోపు మిషన్ గోదావరి ప్రకటిస్తా. రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలు ఎలా అభివృద్ధి చేస్తామో మిషన్ గోదావరిలో వివరిస్తా.

అమలైంది గుంతల పథకం ఒక్కటే!

వైసీపీ అధికారంలోకి వచ్చాక పశ్చిమ గోదావరి జిల్లాలో అమలైంది ఒక్కటే... అదే జగన్ గుంతల పథకం. నేను ఇప్పటివరకు 204 రోజులు నడిచాను. మిగిలిన జిల్లాలో రోడ్ల మీద గుంతలు ఉన్నాయి. ఈ జిల్లాలో రోడ్లు ఎక్కడ ఉన్నాయి అని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. 

చంద్రయాన్ సక్సెస్ వెనుక మన గోతుల రోడ్లు!

మొన్న చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. అందరూ సైకో జగన్ కి కాల్ చేసి కంగ్రాట్స్ సార్ అని చెబుతున్నారంట! జగన్ కి డౌట్ వచ్చింది... చంద్రయాన్ 3 సక్సెస్ అయితే అందరూ నన్ను ఎందుకు పొగుడుతున్నారు అని అనుకున్నాడు. ప్యాలస్ బ్రోకర్ సజ్జలను పిలిచి చంద్రయాన్ 3కి మనకి సంబంధం ఏంటి? అందరూ మనల్ని ఎందుకు పొగుడుతున్నారు అని అడిగాడు. 

అప్పుడు ప్యాలస్ బ్రోకర్ సజ్జల దాని సక్సెస్ వెనుక ముఖ్య పాత్ర మీదే సార్ అన్నాడు. అది ఎలా అని జగన్ అడిగాడు. చంద్రుడిపై తిరిగిన ప్రజ్ఞాన్ రోవర్ ని ముందుగా ఏపీ రోడ్ల మీద తిప్పారు. ముఖ్యంగా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా రోడ్లపై తిప్పారు. అక్కడ చంద్రుడుపై ఉన్న గుంతలు కంటే పెద్ద గుంతలు ఉన్నాయి సార్... అందుకే అది చంద్రుడిపై ఈజీగా తిరగ్గలిగింది. అందుకే అందరూ మీకు శుభాకాంక్షలు చెబుతున్నారు అన్నాడట. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉభయ గోదావరి జిల్లాల్లో తారు రోడ్లు కాకుండా ఖర్చు ఎక్కువ అయినా సిమెంట్ రోడ్లు వేస్తాం.

టీడీపీ కంచుకోట పశ్చిమగోదావరి

టీడీపీ కంచుకోట పశ్చిమగోదావరి జిల్లా. స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మించిన గడ్డ ఉండి. కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉండి. హైద‌రాబాద్-సికింద్రాబాద్ జంట న‌గ‌రాలుగా ఎంత ఫేమ‌స్సో... గోదావ‌రి జిల్లాల్లో ఉండి-భీమ‌వ‌రం జంట నియోజ‌క‌వ‌ర్గాలు అంతే ఫేమ‌స్సు. 

సంక్రాంతి అంటే గుర్తొచ్చేది భీమవరం. సోమేశ్వరస్వామి ఆలయం ఉన్న నేల భీమవరం. భీమవరం వాళ్లు సినిమా ఇండస్ట్రీని కూడా ఏలుతున్నారు. నటులు, నిర్మాతలు, దర్శకుల్లో చాలామంది భీమవరం వాళ్లే.

భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ఎమ్మెల్యే!

భీమవరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని మీరు గ్రంథి శ్రీనివాస్ ని గెలిపించారు. ఆయన భీమవరానికి పొడిచింది ఏంటి? ఆయన ఇంటికి తప్ప నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్లు వేయించాడా? కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేని ఎమ్మెల్యే భీమవరానికి అవసరమా? 

భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ గ్రంథి శ్రీనివాస్. సొంత పార్టీ నేతలే ఇతని అవినీతి గురించి సీఎంకి ఫిర్యాదు చేశారు. రూ.52 కోట్లు విలువ చేసే భూమి వ్యవహారంలో వాటా తీసుకుని కబ్జా చేశారని సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేశారు. అందుకే పేరు మార్చా... ఆయన గ్రంధి శ్రీనివాస్ కాదు గజదొంగ శ్రీనివాస్.

భూబకాసురుడు గ్రంథి శ్రీనివాస్

సైకో జ‌గ‌న్ ఇసుకాసురుడు అయితే గజదొంగ శ్రీనివాస్ భూబకాసురుడు. ప్రజాధ‌నం అంటే ఎమ్మెల్యేకి మ‌హా ఇష్టం. బ్యాంకునే దివాళా తీయించిన ఘన చరిత్ర గజదొంగ శ్రీనివాస్ ది. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేశాడు. పేదలకు ఇళ్లు కట్టలేదు కానీ కొట్టేసిన సొమ్ముతో ఆయన మాత్రం మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు.

భీమవరం మండలం గొల్లవానితిప్ప, దొంగపిండి ప్రాంతాల్లో వందల ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వారు. ఈ భూబ‌కాసురుడు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ట్టినీ వ‌ద‌ల‌డం లేదు. 

పట్టణాన్ని ఆనుకుని ఉన్న అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా బినామీల పేరుతో వెంచర్లు వేసి వందల కోట్లు సంపాదించారు. భూదందాలను బయటపెట్టిన సొంతపార్టీ నాయకులపై కూడా కేసులు పెట్టించాడు గజదొంగ శ్రీనివాస్.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,800.7కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.5 కి.మీ.*

*206వరోజు (6-9-2023) యువగళం వివరాలు*

*భీమవరం/నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*

ఉదయం

8.00 – బేతపూడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – పెదగరువు వద్ద స్థానికులతో మాటామంతీ.

11.00 – వెంప సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

11.05 – వెంప గ్రామంలో భోజన విరామం.

సాయంత్రం

3.00 – వెంపలో క్షత్రియ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

4.00 – వెంప నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – పాదయాత్ర 2,800 కి.మీ.లకు చేరుకున్న సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.

4.35 – పాదయాత్ర నర్సాపురం అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.

5.05 – శేరిపాలెం వద్ద స్థానికులతో మాటామంతీ.

5.50 – నక్కవారిపాలెంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

6.35 – ఎన్టీఆర్ గొల్లగూడెంలో స్థానికులతో మాటామంతీ.

6.50 – మొగల్తూరు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.

రాత్రి

7.05 - మొగల్తూరు స్మార్ట్ పాయింట్ వద్ద కాపు సామాజికవర్గీయులతో భేటీ.

7.35 – మొగల్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.

8.35– సీతారాంపురంలో స్థానికులతో మాటామంతీ.

9.35 – సీతారాంపురం విడిది కేంద్రంలో బస.

******
Advertisement
Nara Lokesh
Jagan
Bhimavaram
West Godavari District
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News