Southwest Monsoon: దేశంలోకి రుతుపవనాల రాకతో కేంద్రం అప్రమత్తం
దేశంలో అత్యధిక వర్షపాతం అందించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యంగా ఈ నెల 8న కేరళను తాకాయి. నిన్న ఏపీ, తమిళనాడు వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రవేశించాయి. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, వరదల పట్ల అధికారులు సన్నద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు మధ్యాహ్నం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. కోస్తా ప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలతో అమిత్ షా సమావేశం కానున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్ లో వర్షాలు, వరదలు, తుపానుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.