USA: భారతీయులకు వీసా జారీలో ఎందుకింత ఆలస్యం?.. అమెరికా కాంగ్రెస్ సభ్యుల ప్రశ్న

  • అమెరికా విదేశాంగ శాఖకు కాంగ్రెస్ సభ్యులు బాబ్ మెనెండెజ్, మైఖేల్ వాల్ట్స్ ప్రశ్న
  • బీ1,బీ2 వీసాల కోసం భారతీయులు గరిష్ఠంగా 600 రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోందని వెల్లడి
  • ఈ పరిస్థితి భారత్-అమెరికా బంధాన్ని దెబ్బతీయొచ్చని హెచ్చరిక
  • కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
  • జాప్యానికి కొవిడ్ కారణమన్న మంత్రి, ప్రస్తుతం వీసా దరఖాస్తుల పరిశీలన వేగవంతమైందని వివరణ
US congress men questions department of state over delay in issuing visas to indians

భారతీయులకు వీసా జారీలో ఆలస్యానికి కారణమేంటని ఇద్దరు అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఆ దేశ విదేశాంగ శాఖను ప్రశ్నించారు. అమెరికాకు పర్యటన, వ్యాపారం నిమిత్తం రావాలనుకునే భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం 450 నుంచి 600 రోజులు వేచి చూడాల్సి వస్తోందని సెనేట్ విదేశీ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు బాబ్ మెనెండెజ్ తెలిపారు. ఈ జాప్యం రెండు దేశాల వ్యాపార సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇండియా కాకస్ సహ అధ్యక్షుడు మైఖేల్ వాల్ట్స్‌తో కలిసి రెండు కాంగ్రెస్ విచారణల్లో పాల్గొన్న బాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

భారత్ క్వాడ్ కూటమిలో భాగస్వామి అని, భారత్-అమెరికా వాణిజ్యం కోట్ల డాలర్ల విలువైనదని మైఖేల్ వాల్ట్స్ గుర్తు చేశారు. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో వీసా సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రీనా బటర్ బదులిచ్చారు. ఈ ఏడాది భారతీయులకు 10 లక్షల వీసాలు జారీ చేయబోతున్నట్టు వెల్లడించారు. కరోనా కారణంగా ఒకప్పుడు దౌత్య కార్యాలయాలు మూతపడినప్పటికీ ప్రస్తుతం అదనపు ఏర్పాట్లతో వీసా దరఖాస్తు పరిష్కారం వేగవంతం చేశామని తెలిపారు.

More Telugu News