IPL 2023: స్పాంజ్‌తో మైదానంలోని నీరు తోడిన గ్రౌండ్స్‌మెన్.. బీసీసీఐని ఆడేసుకుంటున్న నెటిజన్లు

  • ప్రపంచంలోని సంపన్న బోర్డు స్పాంజీలు ఉపయోగించడం బాలేదంటున్న నెటిజన్లు
  • వచ్చిన డబ్బులన్నీ ఎటెళ్లిపోతున్నాయని ప్రశ్న
  • అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించుకోవాలని సూచన
Fans troll BCCI as groundsmen use sponge to dry pitch

ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. దీంతో ఉసూరుమంటూ ప్రేక్షకులు ఇంటిముఖం పట్టారు. వరుణుడు నిన్న ఎలాంటి ఆటంకం కలిగించకపోవడంతో మ్యాచ్ మామూలుగానే ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 

ఆ తర్వాత చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే మళ్లీ వరుణుడు వచ్చేయడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. చివరికి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఓవర్లు కుదించి మ్యాచ్‌ను ప్రారంభించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి విజయం సాధించింది. 

ఇదిలావుంచితే, వర్షం ఆగిన తర్వాత మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేసిన సిబ్బంది నీళ్లు తోడేందుకు స్పాంజ్‌ను ఉపయోగించడం విమర్శలకు కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వాటిని చూసిన నెటిజన్లు బీసీసీఐపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చిన డబ్బంతా ఎటుపోతోందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ స్పాంజ్‌లను ఉపయోగించడం విడ్డూరంగా ఉందని, నీటిని తోడేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

More Telugu News