Vijayashanti: రూ.2 వేల నోట్లకు ఉన్నది ‘గులాబీ’ రంగే కదా, బీఆర్ఎస్ పేరుతో దేశమంతా తోరణాలు కట్టుకోండి: విజయ శాంతి

  • రూ.2 వేల నోటు విషయంలో కొందరు గుండెలు బాదుకోవడం మొదలుపెట్టారన్న విజయశాంతి
  • ఆర్ బీఐ నిర్ణయంతో సామాన్యులకి ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్య 
  • కొందరు మాత్రం కొంపలు మునిగిపోతున్నట్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శ
vijayashanthi fires on BRS Party

రూ.2 వేల నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) ఉపసంహరించుకోవడంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. రూ.2 వేలను ఆర్ బీఐ వెనక్కి తీసుకుంటుండటంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని విమర్శించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. 

‘‘2016లో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటు కోసం రూ.2,000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పింది. అదీగాక కొద్దో గొప్పో నోట్లు ఉన్నవాళ్లు మార్చుకోవడానికి 4 నెలల సమయం కూడా ఇచ్చింది. ఈ నిర్ణయంతో సామాన్యులకి కలిగిన నష్టం ఏమీ లేకున్నా.. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు కొందరు వ్యతిరేక ప్రచారానికి దిగారు’’ అని విమర్శించారు. 

‘‘2016లో నోట్ల రద్దు జరిగినప్పుడు ఎన్ని నోట్లు మురికికాల్వల్లో కనిపించాయో.. ఎంత నల్లధనం అగ్నికి ఆహుతైందో చెప్పాల్సిన పని లేదు. ఇతర రాజకీయ పార్టీల్ని దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం జరిగిందని కొందరు అంటున్నారు. అదే నిజమైతే కర్ణాటక ఎన్నికలకి ముందే ఈ నిర్ణయం వెలువడి ఉండేది’’ అని చెప్పుకొచ్చారు.

‘‘నిజానికి ‘గులాబీ’ నోటు రద్దుతో గుండెలు బాదుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే.. అది తెలంగాణలోని అధికార ‘గులాబీ’ దళం తప్ప ఇంకెవరూ కాదు. రాష్ట్రంలో పెచ్చురిల్లిన అవినీతి, అక్రమార్జన తీరుని గమనిస్తే అధికారగణం దగ్గర తప్ప ఇంకెక్కడా ఈ రూ.2 వేల నోట్ల కుప్పలు కనిపించే పరిస్థితి లేదు. అందుకే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయినా ‘గులాబీ’ నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు’’ అని ఎద్దేవా చేశారు. 

‘‘లక్షల కోట్ల రూ.2 వేల నోట్లకు ఉన్నది ‘గులాబీ’ రంగే కదా! బీఆర్ఎస్ పేర దేశమంతా తోరణాలు కట్టుకోండి. ఆ నోట్లను ఆర్ బీఐ ఉపసంహరించుకోకుంటే.. ఈ నోట్ల పంపిణీ దేశమంతా జరిపించేవారు మీరు’’ అని ఆరోపించారు.

More Telugu News