Ambati Rambabu: రాష్ట్రంలో నిన్ను మించిన సకల కళాకోవిదుడు ఎవరు పవన్?: అంబటి రాంబాబు

  • రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయన్న అంబటి
  • అందుకు పవన్ కల్యాణే ఉదాహరణ అని వెల్లడి
  • పవన్ ముమ్మాటికీ ప్యాకేజి స్టార్ అని స్పష్టీకరణ
  • చంద్రబాబును ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్
Ambati Rambabu counters Pawan Kalyan

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిన్న, ఇవాళ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాజకీయాల్లో హత్యలేవీ ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని, ఎవరి కష్టనష్టాలకు వారే బాధ్యులని ఓ నానుడి ఉందని, అందుకు పవన్ కల్యాణే ఉదాహరణ అని వివరించారు. 

చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యం అని వెల్లడించారు. జగన్ ను ఓడించి ప్రజలకు అధికారం అప్పగిస్తానని పవన్ అంటున్నాడని, ప్రజలకు అప్పగించడం అంటే చంద్రబాబుకు అప్పగించడమేనా? అని అంబటి రాంబాబు నిలదీశారు. 

ఓ విషయంలో తనకు బాధ కలుగుతోందని, జనసైనికులు, వీర మహిళలు, కాపులు పవనే సీఎం అని నినాదాలు చేశారని, కానీ పవన్ నిన్న తాను సీఎం అభ్యర్థిని కానని చెప్పేశాడని అన్నారు. నిన్న సీఎం అభ్యర్థిని కాను అని చెప్పిన పవన్, ఇవాళ ఎన్నికలు అయిపోయాక సీఎం పదవి సంగతి చూసుకుందాం అంటున్నాడని అంబటి విమర్శించారు. 

"గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఒక్క స్థానం... వచ్చింది 6 శాతం ఓట్లు... దీంతో 30 శాతం పెరిగిందా? లేదా, డబ్బులు తీసుకుని సినిమాలు చేసుకుంటే మద్దతు పెరుగుతుందా? లేదా, వారాహిని అందంగా తయారుచేయించుకుని ఇంట్లో పెట్టుకుని తుప్పు పట్టిస్తే నీకు మద్దతు పెరుగుతుందా? 24 గంటలూ రాజకీయాల్లో ఉంటేనే ఇవాళ అంతంత మాత్రంగా ఉంటే... నువ్వు పార్ట్ టైమ్ పొలిటీషియన్ లా అప్పుడప్పుడు వచ్చి జగన్ ను తిట్టి, చంద్రబాబును పొగిడితే మద్దతు పెరుగుతుందా? 

సింగిల్ గా పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతాను అని చెప్పేస్తున్న ఆయన వెంట వీరమహిళలు, జనసైనికులు, కాపు సోదరులు ఇంకెందుకు తిరగడం? నాడు చంద్రబాబు సభలో ఏం చెప్పారు? తాను మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగుపెడతానని మంగమ్మ శపథం చేశారు. ఇప్పుడా శపథాన్ని నిజం చేయడానికి పవన్ కల్యాణ్ జనసైనికులను, కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారిపోయాడు. 

పవన్ కల్యాణ్ ఏం మారలేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. నేను ఏమీ అడగకుండానే మద్దతిస్తానా అని పవన్ అంటున్నాడు. ఏమీ అడగకుండానే నువ్వెందుకు మద్దతిస్తావు నాయనా... ఫుల్ ప్యాకేజి అడిగే మద్దతు ఇస్తావు. ఎన్ని సీట్లు అడుగుతావు...? పాతికో పరకోనా...? చంద్రబాబు ముష్టి వేస్తే ఎత్తుకోవడానికి ఇవాళ నువ్వు జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టే స్థాయికి పతనమయ్యావు. జగన్ స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుంటే ఆయనను గద్దె దించి చంద్రబాబును సీఎం చేయాలంట. 

సకల కళాకోవిదుడు విమర్శలు చేస్తున్నాడు అని పవన్ అంటున్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను.. ఎవరు సకల కళాకోవిదుడు? తెలుగు వాళ్లని, ఇంగ్లీషోళ్లని, హిందీ వాళ్లని అంతర్జాతీయంగా పెళ్లిళ్లు చేసుకున్న నీకన్నా సకల కళాకోవిదుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఉంటారా? అని అడుగుతున్నా... చెప్పండి పవన్ కల్యాణ్ గారూ!" అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా పవన్ ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుతో మీకు ఏ డీల్ కుదిరింది... చెప్పండి? అని ప్రశ్నించారు. 

"మీరు విజయవాడ నోవాటెల్ లో ఉంటే చంద్రబాబు వచ్చాడు... చంద్రబాబు హైదరాబాదులో ఉంటే మీరు వెళ్లారు. రహస్యాలేవీ మాట్లాడుకోలేదని చెబుతున్నావు... మరి ఏం మాట్లాడుకున్నారు? చంద్రబాబుకు అమ్ముడుపోయింది నిజం కాదా? నువ్వు ప్యాకేజి స్టార్ వి కాదా? ప్యాకేజి స్టార్ అంటే చెప్పుతీసుకుని కొడతావా... మరి ప్యాకేజి తీసుకోకపోతే మీరెందుకు వారిని కలుస్తున్నారు?" అని ప్రశ్నించారు. 

"ఈ సందర్భంగా నాకు మరొకటి కూడా గుర్తొస్తోంది. మీ అన్న గారు, చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసి 17 సీట్లు గెలిచారు. మీకంటే ఎక్కువ ఓట్ల శాతం వచ్చింది. ఓ దశలో పార్టీ నడపడం తన వల్ల కాదన్నారు... ఆయన తన పార్టీని ఎవరికీ తాకట్టు పెట్టలేదే. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఓ పదవి అనుభవించాడు. ఆ తర్వాత ఈ రాజకీయాల్లో ఇమడలేనంటూ ఓ దండం పెట్టి వెళ్లిపోయాడు. తన మానాన తాను సినిమాలు చేసుకుంటున్నాడు. సింగిల్ గా వెళితే చచ్చిపోతానని అనుకుంటే, సింగిల్ గా వెళితే జగన్ తుక్కు తుక్కుగా కొడతాడనుకుంటే నువ్వు కూడా విలీనం చేసేయ్" అని హితవు పలికారు. 

తప్పు చేస్తే నిలదీస్తానని చెప్పే పవన్ కల్యాణ్... చంద్రబాబును ఎన్ని సార్లు నిలదీశాడో చెప్పాలని సవాల్ విసిరారు. ముద్రగడ పద్మనాభాన్ని చిత్రహింస పెడుతుంటే నువ్వు మాట్లాడలేదే... ఆ రోజున మేం, జగన్ మాట్లాడాం. ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించాం. హయత్ హోటల్ లో సమావేశమై కాపుల కోసం మాట్లాడాం. ఆ రోజున నువ్వు ఎక్కడ తొంగున్నావు?" అని అంబటి మండిపడ్డారు.

More Telugu News