Jogi Ramesh: పవన్ కల్యాణ్ పూజకు పనికిరాని పువ్వు: మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యలు

  • తాను సీఎం అభ్యర్థిని కానన్న పవన్ కల్యాణ్
  • చంద్రబాబు బూట్లు నాకాలన్న ఆలోచన తప్ప పవన్ కు మరో ఆలోచన లేదన్న మంత్రి జోగి
  • రాజకీయాలకు పవన్ పనికిరాడని విమర్శలు
  • పవన్ ఎప్పటికీ సీఎం కాలేడని స్పష్టీకరణ
Minister Jog Ramesh said Pawan Kalyan never be a CM

వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని, కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. పూజకు పనికిరాని పువ్వులు కొన్ని ఉంటాయని, అలాగే రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు కొందరు ఉంటారని, పవన్ కల్యాణ్ అలాంటివాడేనని విమర్శించారు.

పార్టీ పెట్టేవాడు ఎవడైనా... నా బలం ఏంటి, నేను గెలవగలనా, 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపగలనా అని ఆలోచించాలని జోగి రమేశ్ హితవు పలికారు. కానీ, పవన్ పార్టీ పెట్టి 10 ఏళ్లయినా అలాంటి ఆలోచన చేయడంలేదని అన్నారు. 

"2014లో నువ్వు, టీడీపీ, బీజేపీ మూకుమ్మడిగా పోటీ చేశారు. చంద్రబాబునాయుడ్ని గెలిపించావు... చంద్రబాబునాయుడ్ని భుజాన వేసుకున్నావు. 2019లో జగన్ గెలవకుండా చేయాలని, ఓట్లు చీలగొట్టేందుకు విడిగా పోటీ చేశావు. నీ బలం ఏంటో నీకు స్పష్టంగా తెలుసు... రెండు చోట్ల పోటీ చేశావు... ఒక్కదాంట్లో కూడా గెలవలేకపోయావు. నువ్వే గెలవలేని వ్యక్తివి... ఇవాళ మళ్లీ జగన్ ను ఓడించాలి, వైసీపీని గద్దె దించాలని అంటున్నావు. 

చంద్రబాబు సంక నాకాలి, చంద్రబాబు బూట్లు నాకాలి అనే ఆలోచన తప్ప, దమ్ముగా, ధైర్యంగా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పుకోలేకపోతున్నాడు. రాజమండ్రిలో సీఎం, సీఎం అని నినాదాలు చేస్తే... నేను సీఎం అయిన తర్వాత నినాదాలు చేయాలని చెప్పిన పవన్ కల్యాణ్... నిన్న మాత్రం నేను సీఎంను కాలేను, నేను సీఎం అభ్యర్థినే కాను, నేను చవటను, నేను దద్దమ్మను, నేను పూజకు పనికిరాని పువ్వును అని స్వయంగా చెప్పాడు. 

పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, ప్యాకేజీకి తప్ప దేనికీ వంగడని తాము ముందు నుంచి చెబుతున్నామని, మరోసారి అదే నిజమైంది" అని మంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు. 

పవన్... చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని, చంద్రబాబు కాళ్లు పిసుకుతాడని వ్యాఖ్యానించారు. 20 సీట్లకు తాను చంద్రబాబుకు అమ్ముడవుతానని, చంద్రబాబుకు ధారాదత్తం అవుతానని పవనే స్వయంగా చెప్పాడని వెల్లడించారు. 

పవన్ వెళుతుంటే రోడ్ల పక్కన నిల్చున్న పిల్లలు సీఎం, సీఎం అంటూ అరుస్తుంటారని, అలాంటి వాళ్లందరినీ పవన్ నాశనం చేశాడని మండిపడ్డారు. పొత్తు పెట్టుకుంటే ఓ నాలుగు సీట్లు గెలవొచ్చేమో కానీ, పవన్ ఎప్పటికీ సీఎం కాలేడని జోగి రమేశ్ స్పష్టం చేశారు.

More Telugu News